3G..తరం మారింది.. శివసేన వైఖరి మారింది
ముంబై : తరం మారితే మార్పులు జరుగుతాయా? మార్పు కోసం తరాలు మారుతాయా? కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి పోరాటాలు సాగించిన పాత తరం ఒకవైపు.. ఆ సిద్ధాంతాలను ఏమాత్రం పట్టించుకోని నేటి తరం మరోవైపు. సరిగ్గా ఇలాంటి మార్పు శివసేనలో వచ్చిందా అంటే అవుననే సమాధానం కనిపిస్తోంది.
మహారాష్ట్రలో ప్రభుత్వాలను షేక్ చేసిన చరిత శివసేన సొంతం. ఒకరకంగా చెప్పాలంటే అధికారంలో ఎవరున్నా.. తెరవెనుక ప్రభుత్వం నడిపేది శివసేన అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఇక కొన్ని విషయాల్లోనైతే దేశవ్యాప్త చర్చకు దారితీసేలా ఆ పార్టీ వ్యవహరించేది. మరి ఇప్పుడేం జరుగుతోంది?
కాలం మారింది మైనరూ..!
పాశ్చాత్య సంస్కృతిని శివసేన వీపరీతంగా ద్వేషిస్తుంటుంది. హిందువుల అభిమతానికి అవి వ్యతిరేకమని వాదిస్తుంటుంది. మన దేశంలో మనకంటూ ఓ కల్చర్ ఉందని.. ఇతర దేశాలను ఎందుకు ఫాలోకావడమనేది ఆ పార్టీ భావన. అలా కొన్ని సిద్దాంతాలకు కట్టుబడి నిలబడేది. న్యూ ఇయర్ వేడుకలైనా, వాలంటైన్స్ డే సెల్రబేషన్స్ ఐనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటుంది. మరి ఇదంతా కూడా పాత తరం నాటి శివసేన నేతలకే వర్తిస్తుందా? వారసులుగా వస్తున్న ఈతరం నేతలకు వర్తించదా?
శివసేనలో మార్పు వచ్చిందా?
కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే చేసిన ఓ వినతి చర్చానీయాంశంగా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటలు వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ తెరిచి ఉంచాలనేది దాని సారాంశం. ఈమేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు లేఖ రాశారు. ముంబయి, థానే, పూణె, నవీ ముంబయి నగరాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరారు. అలా చేస్తే షాపింగ్ కారణంగా రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తుందని అందులో పేర్కొనడం గమనార్హం. శివసేన వినతిపై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని.. హోంశాఖ కూడా అనుమతి ఇప్పించేలా చర్చలు తీసుకోవాలని సీఎంను కోరడం విశేషం.
3G ఎఫెక్ట్
బాల్ థాకరే, ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే.. ఇలా శివసేన కుటుంబం మహారాష్ట్రలో కీలకంగా వ్యవహరిస్తోంది. బాల్ థాక్రే మరణానంతరం శివసేనలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. పాత కాలం నాటి పద్దతులకు చెక్ పెట్టినట్లుగా ఉంటోంది రెండో తరం నేతల తీరు. ఇక మూడో తరం వచ్చేసరికి శివసేనలో పెనుమార్పులు కనిపిస్తున్నాయనే వాదనలున్నాయి. తాజాగా ఆదిత్య థాక్రే.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ చర్చానీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో తరాలు మారితే విధానాలు కూడా మారుతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిత్య థాక్రే యువకుడు కావడంతో అలా మాట్లాడి ఉండొచ్చే తప్ప.. పాశ్చాత్య సంస్కృతికి వంతపాడినట్లు కాదని వాదిస్తున్నారు కొందరు.