పురుష కమీషన్ కావాలి ... భార్యాబాధితుల డిమాండ్
గృహహింస, వేధింపులకు గురవుతుంది మహిళలే కాదు పురుషులు కూడా ఉన్నారంటూ భార్యా బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన చేశారు. మహిళల రక్షణకు ఉన్న కఠిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ కొందరు మహిళలు తప్పుడు కేసులు పెడుతూ పురుషులను నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన చెందిన వారు మహిళా కమీషన్ తరహాలో పురుష కమీషన్ కావాలని డిమాండ్ చేశారు.
ఇదెక్కడి చోద్యం: ఈ భర్త విడాకులు కోరాడు... కారణం చాలా సిల్లీగా ఉంది..!
పురుష కళ్యాణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు పెడుతున్న హింసవల్ల చాలా మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషుల సమస్యల పరిష్కారం కోసం కమీషన్ ఏర్పాటు చేయాలని, పురుష కమీషన్ ఏర్పాటు చేసే వరకు తాము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో వేదిక వద్ద వారు ఏర్పాటు చేసిన బొమ్మ పురుషుల అనుభవిస్తున్న వేధింపులకు చిహ్నంగా నిలుస్తుందని వారన్నారు. తప్పుడు కేసులతో వేధింపులకు గురవుతున్న దేశంలోని పురుషులందరి గుర్తుగా గాయపడిన భీష్ముడిని ప్రతిబింబించేలా బొమ్మను ఏర్పాటు చేసి మహిళల వేధింపులతో పురుషుల అంపశయ్యమీద ఉన్నట్లుగానే పరిస్థితి ఉందని తెలియజేశారు.
2005లో ప్రారంభించిన ఈ ట్రస్ట్ లో పురుషులే కాదు కొందరు మహిళలు కూడా సభ్యులుగా ఉండటం విశేషం. ఇక పురుషులు చేసిన ఆందోళన కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొన్నారు. కోడళ్ళ కారణంగా కుమారులు వేధింపులకు గురవుతున్నారని, నిజాయితీగా ఉన్నా కేసులు తప్పడం లేదని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యురాలు కోడలు తప్పుడు కేసులు బనాయించడం వల్ల కలిగిన ఇబ్బందిని చెబుతూ ఆరేళ్లు న్యాయపోరాటం చేసి చివరకు కేసు గెలిచామని చెప్పుకొచ్చారు. మహిళలకు పురుషులకు ఇరువురికి సమానమైన చట్టాలు ఉండాలని ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కూడా అంటున్నారు. మొత్తానికి పురుష కమిషన్ డిమాండ్ ఊపందుకుంది. భార్యా బాధితులు ఢిల్లీ వేదికగా తమ గోడు వెళ్లబోసుకున్నారు.