ముంబైలో డబ్బావాలాల పరిస్థితి దారుణం: ఆకలి తీర్చిన వారికే ఆకలి బాధ దయనీయం
కరోనా లాక్ డౌన్ ప్రభావం ముంబై డబ్బావాలాల మీద దారుణంగా పడింది. లక్షలాది మందికి నిత్యం భోజనం అందించే డబ్బావాలాలు నేడు వారికే భోజనం లేక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఎవరికైతే నిత్యం భోజనం అందిస్తూ సహాయం అందించారో వారి వద్దే డబ్బావాలాలు చేతులు చాపాల్సిన దుస్థితి ఏర్పడింది.ప్రభుత్వం ఆదుకోకుంటే ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోతామని అంటున్నారు డబ్బావాలాలు .
కరోనా దెబ్బకు ముంబై డబ్బావాలాలు విలవిల
వంద సంవత్సరాలకు పైగా ముంబైలో వేలాది సంఖ్యలో డబ్బావాలాలు టిఫిన్ బాక్సులు చేరవేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెల 13 వేల నుండి 15 వేల రూపాయల వరకు సంపాదించేవారు. ఇక వారి భార్యలు సైతం ఇళ్ళలో పనులు చేసి, వంటలు చేసి సంపాదించేవారు. కరోనా దెబ్బకు డబ్బావాలాలకు, వారి భార్యలకు ఉపాధి పోయింది . కరోనా ప్రభావంతో ఉద్యోగులందరూ దాదాపు ఇళ్ల నుండి విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరికి పని లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అన్నమో రామచంద్రా అని ఆక్రోశిస్తున్న డబ్బావాలాలు
దాదాపుగా నిత్యం రెండులక్షల మందికి పైగా ఉద్యోగులకు భోజనం అందించే డబ్బావాలాలు ఇప్పుడు తమ భోజనం కోసం బాధపడుతున్నారు. తమ ఆకలి బాధలు తీర్చే వారెవరు అంటూ ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం నిరీక్షిస్తున్నారు. కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఇప్పట్లో కార్యాలయాలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు డబ్బావాలాలు. అన్నమో రామచంద్రా అంటూ ఆక్రోశిస్తున్నారు.
ముంబైలో పరిస్థితి దారుణం .. ఆర్ధిక సంక్షోభంలో డబ్బావాలాలు
ఇక మహారాష్ట్రలో కరోనా పరిస్థితి దారుణంగా తయారైంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పాటు, పెరుగుతున్న మరణాలతో మహారాష్ట్రలో మరణమృదంగం మోగుతోంది.ఇక ముంబై మహానగరం కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. ఈ పరిస్థితులు ఇప్పట్లో మారేలా కనిపించటం లేదు. దీంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డబ్బావాలాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావమే కాకుండా,ఇటీవల వచ్చిన నిసర్గ తుఫాన్ ఎఫెక్ట్ కూడా ముంబై డబ్బావాలాలపై పడింది.
Recommended Video
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి .. లేదంటే మరణమే శరణ్యం అంటున్న డబ్బావాలాలు
ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై వంటి ప్రాంతంలో జీవించాలంటే కష్టంగా మారిందని భావించిన డబ్బావాలాలు సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభుత్వం తమకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లేదంటే ఆకలి చావులే తమకు శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శతాబ్దానికిపైగా లంచ్ బాక్సులు చేరవేస్తున్న డబ్బా వాలాలకు ప్రభుత్వ సాయం అందించకుంటే వేలాదిగా ఉన్న డబ్బావాలాలు వీధిన పడే ప్రమాదం ఉంది. ఆకలి చావులకు గురయ్యే అవకాశముంది.