కశ్మీర్ లో పరిస్థితులు భయపెడుతున్నాయి..! స్వస్ధలాలకు పయనమవుతున్న స్టూడెంట్స్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ లో పరిస్థితులు ఒక్క సారిగా గంభీరంగా మారిపోయాయి. ఏం జరుగుతుందో, ఎందుకు అంత పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారో ఎవరికీ అంత తొందరగా అంతుచిక్కని పరిస్థితులు తలెత్తాయి. జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ నిట్లోని తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయల్దేరారు. జమ్ము నుంచి శనివారం రాత్రి 12 గంటలకు అండమాన్ ఎక్స్ప్రెస్లో బయల్దేరిన 31 మంది విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ రైల్వేస్టేషన్లో వీరికి ఏపీభవన్ అధికారులు భోజనాలు, మందులతోపాటు దారి ఖర్చుల కోసం కొంత నగదు అందించారు.
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ వారితో మాట్లాడారు. ఆదివారం రాత్రి 10గంటలకు మరికొంతమంది తెలుగు విద్యార్థులు దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయంత్రి కిషన్రెడ్డి సూచనల మేరకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ రైల్వేస్టేషన్లో వారిని కలిసి యోగక్షేమాలు కనుక్కున్నారు. అనంతరం వీరికి సదరన్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం వారిని స్వస్థలాలకు పంపుతామన్నారు.
మేనిఫెస్టోలోనే నాడు స్పష్టం చేసిన బీజేపీ: నేడు ఆచరణలో 370 రద్దు
జమ్మూకశ్మీర్లో పరిస్థితుల నేపథ్యంలో తాము సురక్షితంగా స్వస్థలాలకు చేరడానికి అన్ని విధాలా సాయం చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15కల్లా సమస్య కొలిక్కివస్తుందని కళాశాల యాజమాన్యం చెప్పిందన్నారు. ఆర్టికల్ 35ఏ రద్దు చేస్తారన్న ప్రచారం కశ్మీర్లో ఉందని, అదే జరిగితే అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. నిట్ క్యాంపస్ను ఆర్మీ బేస్ క్యాంపుగా మార్చుకోవడానికే తమను సొంతూళ్లకు పంపుతున్నట్లు భావిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు.
శ్రీనగర్ ఎన్ఐటీలోని తెలుగు విద్యార్థులను జమ్మూ ఎన్ఐటీకి బదిలీ చేయాలని కోరుతున్నామన్నారు. శ్రీనగర్ ఎన్ఐటీలోని తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. జమ్మూకశ్మీర్ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతోనే జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.