వరదల దెబ్బకు రెండు రోజులు ఇంటి మీద దంపతులు, రక్షించాలని ఆర్తనాదాలు!
బెంగళూరు: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెళగావి జిల్లాలో వరద నీరు ఇంటిలోకి చొరబడి నిండిపోవడంతో రెండు రోజులకుపైగా దంపతులు ఇంటి పైకప్పు మీద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తూ బిక్కుబిక్కుమంటు గడిపారు.
బెళగావి తాలుకా కబలాపుర గ్రామంలోకి బళ్లారి నాళా నీరు ఒక్కసారి దూసుకు వచ్చింది. చూస్తుండగానే ఇళ్లలోని నీరు వచ్చి నిండిపోయింది. అదే గ్రామం సమీపంలోని తోటలోని ఇంటిలో నివాసం ఉంటున్న కాళేశ జంగన్నవర్, రత్నవ్వ దంపతుల ఇంటిలోకి నీరు చొచ్చుకు వచ్చింది. కాళేశ దంపతులు బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు.
వరద నీటి ప్రవాహానికి కాళేశ దంపతులు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయారు. విధిలేని పరిస్థితిలో దంపతులు ఇంటి పై కప్పు మీదకు చేరుకున్నారు. తమను రక్షించాలని వేడుకున్నారు. గ్రామంలోని ప్రజలు తోట ఉన్న ప్రాంతానికి రాకపోవడంతో కాళేశ దంపతులు ఆందోళనకు గురైనారు.
వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక దళం, ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటి పై కప్పు మీద కుర్చున్న దంపతులు మమ్మల్ని ఎవరైనా రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు. వరద నీటి ప్రవాహం ఎక్కడ తమ ఇంటిని కుప్పకూల్చుతుందో, మా ప్రాణాలు ఎక్కడపోతాయో అని ఆందోళనతో కాళేశ, రత్నవ్వ దంపతులు కేకలు వేశారు.
రెండు రోజుల పాటు కాళేశ, రత్నవ్వ దంపతులు ఇంటి పై కప్పు మీద కుర్చుని తిండి, నీళ్లు లేక ఆర్తనాదాలు చేస్తూ బిక్కుబిక్కు మని గడిపారు. చివరికి విషయం గుర్తించిన ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది పడవలో తోటలోని ఇంటి దగ్గరకు చేరుకుని కాళేశ దంపతులను రక్షించడానికి ప్రయత్నించారు.
వీలు కాకపోవడంతో ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఏమీ చెయ్యలేకపోయారు. హెలికాప్టర్ ద్వారా కాళేశ, రత్నవ్వ దంపతులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యురాలు లక్ష్మి హెబ్బాళ్కర్, డీసీపీ యశోధా వంటగూడి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాళేశ దంపతులు మాత్రం వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.