కేరళ ఎమ్మెల్యే శశిపై లైంగిక వేదింపుల ఫిర్యాదు, మహిళా నేత, ఒక సంవత్సరం, విచారణ!
తిరువనంతపురం: కేరళలో భారీ వరదల కారణంగా ప్రజలను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. ఇప్పుడు సీపీఐ (ఎం) పార్టీకి చెందిన కేరళ సీనియర్ ఎమ్మెల్యే పీకే. శశి మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడం, మహిళా నాయకురాలు పార్టీ కేంద్ర కమిటీని ఆశ్రయించడంతో కేరళ ప్రభుత్వం ఉలిక్కిపడింది.
గతంలో పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు ఆరోపణలు చేస్తున్నారు. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ వైఐ)కు చెందిన నాయకురాలు ఎమ్మెల్యే పీకే శశిమీద లైంగిక వేదింపుల ఆరోపణలు చేశారు.
సీపీఐ (ఎం) ఎమ్మెల్యే పీకే. శశి గత ఏడాది నుంచి తనను లైంగికంగా వేదింపులకు గురి చేస్తున్నారని ఆగస్టు నెలలలో కేరళ పార్టీ కార్యదర్శి కూడియేరి బాలకృష్ణన్ కు, పాలక్కాడ్ జిల్లా కమిటీకి లేఖ రాసినా ఇంత వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు.
రాష్ట్ర కమిటీ పెద్దలు ఎమ్మెల్యే పీకే. శశి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు పార్టీ కేంద్ర కమిటీ పెద్దలు బృందా కారత్, సీతారాం ఏచూరికి లేఖ రాశారు. ఒక్క సంవత్సరం నుంచి తనను ఎమ్మెల్యే పీకే. శశి లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు మనవి చేశారు.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పీకే. శశి తన రాజకీయ జీవితం నాశనం చెయ్యాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎవ్వరినీ లైంగికంగా వేదించలేదని అన్నారు. అయితే కేరళలో పాలక్కాడ్ జిల్లా కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే పీకే. శశి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎం) పార్టీ కేంద్ర కమిటీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని తెలిసింది.