నికిత మర్డర్ కేస్: కామర్స్ విద్యార్థినిపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో: ముఖ్యమంత్రి స్టేట్మెంట్
చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్లో నికిత తోమర్ అనే విద్యార్థిని హత్యోదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. పట్టపగలు నడిబజారులో దిగ్భ్రాంతికరంగా చోటు చేసుకున్న నికిత తోమర్ హత్యోదంతంపై ఏకంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిందితులను అరెస్టు చేసినట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఆ కొద్దిసేపటికే ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ విజ్..అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనంలో ఘర్షణ: పోలీసుల కాల్పులు: దూసుకెళ్లిన బుల్లెట్లు: ఒకరి మృతి
21 సంవత్సరాల ఫైనల్ ఇయర్ కామర్స్ విద్యార్థిని నికిత తోమర్ను ఆమె పరిచయస్తుడే కాల్చి చంపాడు. సోమవారం మధ్యాహ్నం 3:40 నిమిషాల సమయంలో బల్లబ్గఢ్ కళాశాల ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. కళాశాల నుంచి బయటికి వచ్చిన నికిత తోమర్ను వారు తమ వెంట కారులో రావాల్సిందిగా తౌసిఫ్, అతని స్నేహితుడు రేహాన్ బలవంతం చేశారు. దానికి ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న తుపాకితో కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించారు.
దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఫరీదాబాద్ పోలీసులు విడుదల చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ అనిల్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన సిట్.. నిందితుల కోసం జల్లెడ పట్టింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వారిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ హత్యోదంతంలో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి మర్డర్ వెపన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని మనోహర్ లాల్ ఖట్టర్, అనిల్ విజ్ హామీ ఇచ్చారు.
Recommended Video
ఈ ఘటన హర్యానాలో రాజకీయ దుమారానికి కారణమైంది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున బల్లబ్గఢ్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు వారికి అండగా నిలిచారు. దీనితో ముఖ్యమంత్రి, హోం మంత్రి స్వయంగా నికిత తోమర్ మర్డర్ కేస్లో జోక్యం చేసుకున్నారు. ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ ఓపీ సింగ్తో హోం మంత్రి మాట్లాడారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఓ నివేదికను తెప్పించుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.