ఆ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం: ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ కాలంలో చీకటి రోజులను ఎప్పటి మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 1975లో సరిగ్గా ఇదే రోజున నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రకటన చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా చెప్పుకునే ఎమర్జెన్సీకి నేటిక 46ఏళ్లైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని విమర్శలు సంధించారు.
ఎమర్జెన్సీ అమలులో ఉన్న 1975 నుంచి 1977 మధ్య కాలంలో వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారనే దానికి సాక్ష్యంగా నిలుస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలకు అనుగుణంగా జీవించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
అంతేగాక, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిషేధించిన వాటిని మీరు నమ్మగలరా? అంటూ బీజేపీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ లింక్ను మోడీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఏ విధంగా తొక్కేసిందో చూడండంటూ విమర్శించారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించిన గొప్పవాళ్లందరినీ గుర్తుంచుకుంటామన్నారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎమర్జెన్సీపై స్పందించారు. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని అన్నారు. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న గొంతులను అణిచివేసేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధించారని అమిత్ షా విమర్శించారు. 1975లో ఇదే రోజున అధికార స్వార్థం, అహంకారంతో దేశంలో అత్యవసర పరిస్థితులు విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని మండిపడ్డారు.
సత్యాగ్రహులను పెద్ద సంఖ్యలో రాత్రికి రాత్రే జైళ్లలో బంధించారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛకు కూడా సంకెళ్లు వేశారన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించి పార్లమెంట్, కోర్టులను మాట్లాడలేని ప్రేక్షకులుగా మార్చేశారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అమలులో ఉన్న 21 నెలలపాటు క్రూరమైన పాలనలో హింసను అనుభవిస్తూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన దేశవాసులందరి త్యాగానికి ధన్యవాదాలు తెలిపారు.