Delhi High Court: 24 వారాలు దాటినా అబార్షన్ చేసుకోవచ్చు.. కానీ..
అత్యాచార బాధితురాలు గర్భం దాల్చి 24 వారాలు దాటినా సంరక్షకురాలి అనుమతితో అబార్షన్ చేసుకోవచ్చిని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
అత్యాచార బాధితురాలు గర్భం దాల్చి 24 వారాలు దాటినా అబార్షన్ చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. మామూలుగా అయితే 24 వారాలలోపు ఉన్న గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఉంది. కానీ ఈ కేసులో అత్యాచారా బాధితురాలు గర్భం దాల్చడంతో 24 వారాలు దాటినా అబార్షన్ చేయ్యొచ్చని న్యాస్థానం పేర్కొంది. ఈ కేసులో బాధితురాలు 25 వారాల గర్భవతి.. ఈమెకు అబార్షన్ చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
మానవ హక్కు
లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిపై మాతృత్వ బాధ్యతను అప్పగించడం ఆమె మానవ హక్కును ఉల్లంఘించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. బాధితురాలిని లైంగికంగా వేధించిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయడం చెప్పలేని బాధను కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. నిందితుడు చేసిన గాయం ఆమెను ఎప్పుడూ వెంటాడుతునే ఉంటుందని పేర్కొంది.
24 వారాలు దాటినా
అందుకే 24 వారాలు దాటినా తల్లి అనుమతితో అబార్షన్ చేసుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన దంపతులు నిర్మాణ పనులకు వెళ్తుంటారు. వారికి 14 ఏళ్ల కూతురు ఉంది. తల్లిదండ్రులు కూలీకి వెళ్లిన సమయంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత వారు ఆస్పత్రికి వెళ్లకపోవడంతో బాలిక గర్భం దాల్చింది.
బాధితురాలి తల్లి
బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకునేలోపే 24 వారాలు దాటిపోయాయి. దీంతో బాలిక తల్లి గర్భం తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. బాధితురాలి తల్లి అంగీకారంతో అబార్షన్ చేసుకోవచ్చని తెలిపారు.
ఆమె గర్భం తొలగించేందుకు వీలుగా శుక్రవారం రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) హాస్పిటల్లోని కాంపిటెంట్ అథారిటీ ముందు హాజరు కావాలని కోర్టు సూచించారు.
మెడికల్ బోర్డు
మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురి అయి గర్భవతి అయితే, ఆమె చట్టబద్ధమైన సంరక్షకుని సమ్మతితో అబార్షన్ చేయ్యవచ్చని కోర్టు పేర్కొంది. అయితే బాధితురాలిని మెడికల్ బోర్డు ముందు హాజరుపరచాలని చెప్పింది. రేప్ బాధితురాలికి మెడికల్ టెస్టుల సమయంలో తప్పనిసరిగా యూరిన్ టెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. చాలా కేసుల్లో ఇది చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది.