దినకరన్ సామాన్యుడు కాదు: వాట్సాప్ టెక్నాలజీతో సినిమా చూపించాడు!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యడానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది.
శశికళ అక్కకుమారుడు టీటీవీ దినకరన్ తన మీడియేటర్ (బ్రోకర్) సుఖేష్ చంద్రశేఖర్ కు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడలేదని, వాట్సాప్ లో సంప్రదిస్తూ మెసేజ్ లు పంపించాడని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు గుర్తించారు. ఈ సందర్బంలో టీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.
సాధ్యం కాలేదని ఆలస్యం
టీటీవీ దినకరన్, సుఖేష్ చంద్రశేఖర్ ల మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి అంటూ ఆరా తీయ్యడానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ఫోన్ సంభాషణలు సేకరించడం ఢిల్లీ పోలీసులకు సాధ్యంకావడం లేదు.
వాట్సాప్ టెక్నాలజీ కాపాడుతుందని స్కెచ్
వాట్సాప్ సంస్థ తన ఫోన్ కాల్స్ , మెసేజ్ లు, వీడియోలను ఎన్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ అనే టెక్నాలజీ ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ కారణంగా ఇతరులు ఎవ్వరూ మరొకరి వాట్సాప్ మెసేజ్ లు, సంభాషణలు సేకరించడం సాధ్యం కాదు.
చూడటానికి అమాయకుడు
పోలీసుల విచారణలో టీటీవీ దినకరన్ తాను, సుఖేష్ చంద్రశేఖర్ భేటీ అయ్యామని అంగీకరించాడని తెలిసింది. అయితే వారిద్దరి మద్య ఎలాంటి సంభాషణలు జరిగాయి ? వాటి వివరాలు ఏమిటి ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
డీల్ ఎలా కుదిరింది
ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వాలనే డీల్ వీరి మద్య ఎలా కుదిరింది ? అనే పూర్తి వివరాలు సేకరించడానికి వారిద్దరి వాట్సాప్ సందేశాలు సేకరించడానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సైబర్ విభాగం అధికారులతో చర్చిస్తున్నారు.
ఇప్పటికి దినకరన్ సేఫ్, చిక్కితే అంతే
మొత్తం మీద వాట్సాప్ టెక్నాలజీ ఉపయోగించిన టీటీవీ దినకరన్ కీలకమైన సాక్షాలు చిక్కకుండా జాగ్రత పడ్డాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అవసరం అయితే వాట్సాప్ సంస్థ సహాయం తీసుకుని దినకరన్ కు సినిమా చూపించాలని ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారని తెలిసింది.