అగ్నిగుండంగా భూమి..! మానవుడి మనుగడ కష్టమంటున్న శాస్త్రవేత్తలు..!!
హైదరాబాద్ : వాతావరణం మారుతోంది. భూమి నిప్పుల కొలిమిలా తయారవుతోంది. ఇంకో ముప్పై ఏళ్లలో భూమి మీద మనుషుల మనుగడ కష్ట తరం కానుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2050 కల్లా భూమి సగటు ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా పెరుగుతాయని, ఫలితంగా భూవాతావరణం మార్చలేని స్థితికి చేరుకుంటుందని వారు అభిప్రాయపడ్డారు. పెట్రోలు, డీజిళ్ల వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అడవుల నరికివేత ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే వారి అంచనాలు ఖచ్చితంగా నిజమవుతాయని తెలిపారు.
వాతావవరణంలో మార్పులను వెంటనే తీసుకురాకుంటే భూమి నిప్పుల కొలిమిలా మారుతుందని, మనిషి బతికేందుకు వీలుకాని పరిస్థితులు ఏర్పడుతాయని వారూ తెలిపారు. భూమి మీద కనీసం 35 శాతం భూభాగంలో.. మొత్తం జనాభాలో 55 శాతం మందిపై విపరీతమైన వేడి వాతావరణం ప్రభావం పడుతుందని.. మనిషి బతికేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఏటా 20 రోజుల వరకూ ఉండాల్సి వస్తుందని అంటున్నారు.
అంతే కాకుండా అమెజాన్ అడవులు మొదలుకొని సముద్రపు పగడపు దిబ్బల వరకూ చాలా జీవజాతుల ఆవాస ప్రాంతాలు నాశనమైపోతాయని వడగాడ్పులు పెచ్చరిల్లడంతోపాటు కార్చిచ్చులు, కరవులు సాధారణమైపోతాయని వివరించారు. ఆసియాలోని జీవనదుల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడం వల్ల 200 కోట్ల మంది ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు.మెక్సికో, సెంట్రల్ అమెరికాలలో వర్షపాతం సగానికిపైగా తగ్గిపోతుందని ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యవసాయం అస్సలు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
ప్రస్తుతం నాలుగైదు ఏళ్లకు ఒకసారి వచ్చే ఎల్నినో ఏటా వచ్చినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే.. పెద్ద ఎతున్న మార్పులు తేవాలని,ఆ మార్పులు ఈ క్షణం నుండే ప్రారంభమయితే దాని ప్రభావాన్ని కొంత మేరకు తగ్గించొచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి, అడవుల శాతాన్ని పెంచి భావితరాలకు బాటలు వేయాలని వారూ సూచించారు.