ప్రధాని మోడీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సవాల్, ప్రతిపక్షాలతో టీడీపీ ఎంపీలు!
న్యూఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతామన్న భయం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ సమావేశాల్లో ఐదు ముఖ్యమైన బిల్లులు ఆమోదింపచేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్దం చేసుకుంది. ఇదే సమయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ రాజ్యం
1969 డిసెంబర్ 17 నుంచి 1972 ఏప్రిల్ 1వ తేదీ వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా బిడి ఖోబ్రాగడే (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) ఉన్నారు. మిగిలిన పూర్తి కాలం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు.
బీజేపీ ప్రయత్నాలు
ప్రస్తుతం రాజ్యసభలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎలాగైనా డిప్యూటీ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. రెండు మూడు చిన్నచిన్న పార్టీల మద్దతుతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి సొంతం చేసుకోవాలని బీజేపీ చర్చలు జరుపుతోంది. అవసరం అయితే అన్నాడీఎంకే పార్టీ మద్దతు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
123 ఓట్లతో విజయం
రాజ్యసభలో మొత్తం 244 ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి 123 ఓట్లు అవసరం అవుతోంది. బీహార్ నుంచి ఓ స్థానం ఖాళీగా ఉంది. బీజేపీకి 71 మంది ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షాలతో కలుపుకుంటే బీజేపీకి 115 ఎంపీలు ఉన్నారు.
అన్నాడీఎంకే మీద ఆశలు
రాజ్యసభలో అన్నాడీఎంకే పార్టీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. బీజేడీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రెండు పార్టీల మద్దతుతో ఎలాగైనా మొదటి సారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి సొంతం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
టీడీపీకి ప్రతిపక్షాల గాలం
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 50 మంది ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిసి ఎలాగైనా మళ్లీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన టీడీపీ ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తే వారి బలం 117కు చేరుతోంది. ఇక టీఎంసీకి చెందిన సుఖంద్ శేఖర్ రాయ్, సీపీఐ (ఎం) ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది.
రాజ్యసభలో ఎంపీల ఓట్లు
రాజ్యసభలో బీజేపీకి 71 మంది, కాంగ్రెస్ కు 50 మంది, అన్నాడీఎంకేకి 13 మంది, టీఎంసీకి 13 మంది, బీజేడీకి 9 మంది, టీడీపీకి 6 మంది, టీఆర్ ఎస్ కు 6 మంది, జేడీ (యూ) 6 మంది, సీపీ (ఎం)కు 5 మంది, బీజేడీకి 5 మంది, డీఎంకేకి నలుగురు, బీఎస్పీకి నలుగురు, ఎన్సీపీకి నలుగురు, ఆప్ కు ముగ్గురు, సీపీఐకి ముగ్గురు, ఎస్ఏడీకి ముగ్గురు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు, పీడీపీకి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు ఆరు మంది, నామినేటెడ్ సభ్యులు ఆరు మంది, జేడీఎస్, కేరళ కాంగ్రెస్ (ఎం), ఐయూఎంఎల్, సిక్కిం డెమక్రటిక్ ఫ్రంట్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, బీడీఎఫ్ పార్టీలకు ఒక్కో ఎంపీలు ఉన్నారు.