వెంకయ్య నాయుడి తల మీదకు వచ్చింది
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో అత్యధిక సీట్లు సంపాధించిన బీజేపీకి చేదు అనుభవం ఎదురైయ్యింది. ముగ్గురు కేంద్ర మంత్రులు ఈ మేయర్ ఎన్నికలలో పాల్గోని ఓట్లు వేసినా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది.
ఈ దెబ్బతో అధిష్టానికి ఏమి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, అనంతకుమార్, డి.వి. సదానంద గౌడ తలలు పట్టుకున్నారు. కేవలం ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో వీరు విఫలం అయ్యారు.
బీబీఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అత్యధిక సీట్లు బీజేపీకి వచ్చాయి. ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ బీజేపీని ఆదరించిన బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. బీబీఎంపీ మేయర్ సీటు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఆ సందర్బంలో కాంగ్రెస్ సైతం ఓటమిని అంగీకరించింది. అయితే బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తెర వెనుక చక్రం తిప్పారు. ఎలాగైనా బీజేపీకి షాక్ ఇవ్వాలని ప్లాన్ వేసి ముందుగా స్వతంత్ర అభ్యర్థులను సంప్రదించారు.
తరువాత జేడీఎస్ నాయకులతో రాయబారం నడపడం, వారు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. జేడీఎస్ నాయకులతో బీజేపీ నాయకులు సంప్రదించకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు.
ఇప్పుడు బీబీఎంపీని కాంగ్రెస్ హైజాక్ చేసిందని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే అధిష్టానానికి సమాధానం చెప్పవలసిన భాద్యత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడి మీద పడింది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్న సందర్బంలో బీబీఎంపీ మేయర్ సీటును బీజేపీ చేతులారా వదిలేసింది.