రాబర్ట్ వాద్రాకు బిగుస్తున్న ఉచ్చు.. కస్టడీలోకి తీసుకొనేందుకు ఈడీ దూకుడు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించేందుకు సిద్దమవుతున్నది. మనీ చైన్ స్కామ్లో ఆయనను విచారించడానికి కస్టడీలోకి తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఈడీ కోరింది. గురువారం రాబర్ట్ వద్రా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈడీ వేగంగా పావులు కదుపుతున్నది. వివరాల్లోకి వెళితే..
మనీ చైన్ కుంభకోణంలో
మనీ చైన్ కుంభకోణం కేసులో కోర్టు బెయిల్ తిరస్కరించిన వెంటనే ఈడీ ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో వాద్రా సహకరించడం లేదు. ఈ కేసులో చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం రాబట్టాలి. కాబట్టి అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం అని జస్టిస్ చంద్ర శేఖర్ను ఈడీ కోరింది. ఈ కేసులో ఈడీ అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఈడీకి వాద్రా సహకరిస్తున్నారు
అయితే ఈడీ చేసిన ఆరోపణలను రాబర్ట్ వాద్రా లాయర్ ఖండించారు. తన క్లయింట్ విచారణకు సహకరిస్తున్నారు. అధికారులు ఇప్పుడు కోరితే అప్పుడు ఈడీ ముందు హాజరయ్యారు. ఇక ముందు కూడా ఎలాంటి విచారణకైనా వాద్రా సిద్ధం అని ఆయన తెలిపారు. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కక్ష సాధింపునకు పాల్పడటం సరికాదు అని అన్నారు.
ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు
నా క్లయింట్ (వాద్రా) ముందు ఈడీ పెట్టిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. వాటిని ఒప్పుకోలేదు. అంతమాత్రనా సహకరించడం లేదని చెప్పడం సరికాదు అని జస్టిస్కు చంద్రశేఖర్కు వాద్రా తరఫు న్యాయవాది వివరించారు. ఈ విచారణ మళ్లీ నవంబర్ 5వ తేదికి వాయిదా వేశారు.
అసలు ఈ కేసు ఏమిటంటే..
లండన్లో రాబర్ద్ వాద్రా కొనుగోలు చేసిన ఆస్థిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఆరోపించింది. లండన్లోని బ్రయస్టన్ స్క్వేర్లో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో ఈ ఆస్తిని వాద్రా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను వాద్రా తోసిపుచ్చుతున్నారు.