ఈ లెక్కలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే: ఆ ఒక్క మంత్రి భోజనం ఖర్చు లక్షల్లో!..
ఇక భోజన ఖర్చుల విషయానికి వస్తే.. న్యాయశాఖ మంత్రి టీ.బి జయచంద్ర ఒక్కరే రూ.4,07,033 మొత్తాన్ని తన తిండి కోసం ఖర్చు పెట్టారు.
బెంగళూరు: ప్రజా ప్రతినిధులుగా ఒక్కసారి ఎన్నికైతే చాలు.. తరాలు తిన్నా.. తరగని డబ్బును పోగేసుకునే అమాత్యులు ప్రతీ రాష్ట్రంలో ఉన్నారు. లక్షల్లో జీతాలు.. ఎక్కడికెళ్లినా విలాసవంతమైన సౌకర్యాలు.. అన్నింటికి మంచి జేబులోంచి పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అంతా ప్రజాధనమే కాబట్టి.. ఎంత ఖర్చు పెట్టినా.. ఎలా ఖర్చు పెట్టినా.. అడిగినవారే ఉండరు.
జవాబుదారీ తనం కొరవడిన చోట అమాత్యుల ఖర్చుల లెక్కలు చూస్తుంటే.. ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది మంత్రులు తిండి కోసం లక్షల్లో ఖర్చు చేశారు. కేవలం 10రోజుల వ్యవధిలోనే.. ఒక్కో ప్రజాప్రతినిధి తిండి ఖర్చుకు లక్షల రూపాయలు వెచ్చించడం గమనార్హం.
గతేడాది బెళగావిలో జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు చేసిన ఖర్చు ఇది. నవంబర్ 21,2016 నుంచి డిసెంబర్ 3,2016వరకు వీరిందరికి స్థానిక ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హోటల్ బిల్లులకు రూ.57,99,375 చెల్లించారు.
ఇక భోజన ఖర్చుల విషయానికి వస్తే.. న్యాయశాఖ మంత్రి టీ.బి జయచంద్ర ఒక్కరే రూ.4,07,033 మొత్తాన్ని తన తిండి కోసం ఖర్చు పెట్టారు. ఆవిధంగా భోజన ఖర్చుల లెక్కల్లో ఆయనే టాప్ లో ఉన్నారు. బీజేపీ పక్ష నేత జగదీశ్ శెట్టర్ రూ.50వేలతో చివరి స్థానంలో ఉన్నారు.
హోటల్ గదుల అద్దె, ప్రజాప్రతినిధుల భోజనం, ఇతరత్రా సౌకర్యాలు, వారి భద్రతా ఖర్చులన్ని కలిపితే.. మొత్తంగా రూ.7.20కోట్లు లెక్క తేలింది. ఇంత ఖర్చు చేసి బస ఏర్పాటు చేస్తే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది మాత్రం కేవలం 55గం. మాత్రమే కావడం గమనార్హం. ఈ లెక్కన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం వెచ్చిస్తున్న సమయానికి, వీరి ఖర్చులకు ఎంత అగాథం ఉందో అర్థం చేసుకోవచ్చు.