The Eyes of Darkness: 40 ఏళ్ల కిందటే కరోనా వైరస్ గురించి: వుహాన్-400గా: నవలా రచయిత..!
న్యూఢిల్లీ: నవలా రచయితలు, కథకుల ఊహలకు ఆకాశమే హద్దు. దాన్ని మించి కూడా వారి ఊహాశక్తి ఉంటుంది. నవలా రచయితల ఊహాశక్తి గురించి ఏ మాత్రం అంచనా వేయలేం. లాజిక్లకు అందదు. కాల్పనికతను జోడిస్తూ నవలను రక్తి కట్టించడానికి మాత్రమే వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి వాస్తవ రూపం దాల్చుతాయనడానికి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి.
చైనాను చుట్టుముట్టిన భయానక కరోనా వైరస్ గురించి డీన్ కూంట్జ్ అనే రచయిత ముందే ఊహించాడేమో.. అందుకే తాను రాసిన ఓ నవలలో ఆ అంశాన్ని ప్రస్తావించాడు. కరోనా వైరస్ పేరును డీన్ కూంట్జ్ ఎక్కడా పొందుపరచలేదు గానీ.. ఆ వైరస్కు వుహాన్-400 అని నామకరణం చేశాడు. ఇప్పుడీ నవల నెట్టింట్లో వైరల్గా మారింది. వుహాన్-400 గురించి, ఆ రచయిత డీన్ కూంట్జ్ గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కాస్తా హల్చల్ చేస్తోంది.
Is Coranavirus a biological Weapon developed by the Chinese called Wuhan -400? This book was published in 1981. Do read the excerpt. pic.twitter.com/Qdep1rczBe
— Manish Tewari (@ManishTewari) February 16, 2020
ఆ నవల పేరు ది ఐస్ ఆఫ్ డార్క్నెస్. 1981లో ఈ నవల ప్రచురితమైంది. ఆ నవలలో చాప్టర్ 39లో వుహాన్-400 గురించి ప్రస్తావించాడు డీన్ కూంట్జ్. ప్రత్యర్థులపై దాడి చేయడానికి వుహాన్-400 వైరస్ను సృష్టించాల్సి ఉంటుందని, బయో వెపన్గా తీర్చిదిద్దితే ఇక తిరుగు ఉండదంటూ కొన్ని పాత్రల మధ్య చోటు చేసుకున్న సంభాషణల మధ్య వుహాన్-400 పదాన్ని ప్రయోగించాడు రచయిత. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే..డీన్ ఎంత పక్కాగా ఆలోచించాడో, తన ఊహాశక్తిని ఎంతగా పదును పెట్టాడనేది అర్థం చేసుకోవచ్చు.