కావేరీ నీరు విడుదల: రైతుల ఆందోళన ఉద్రిక్తం, పట్టించుకోని ప్రభుత్వం, సీసీ కెమెరాలతో నిఘా!
బెంగళూరు: కావేరీ నీరు పరఫరాకాక తాము సతమతం అవుతుంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని కర్ణాటకలోని మండ్య, మైసూరు జిల్లా రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కావేరీ నీరు విడుదల చెయ్యకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, వాటికి ప్రభుత్వం భాద్యత వహించాలని రైతులు హెచ్చరించారు.
మండ్య, మైసూరు జిల్లా ప్రజలు పిలుపునిచ్చిన కృష్ణరాజసాగర్ జలశాయం ముట్టడి (కేఆర్ఎస్ డ్యాం) కార్యక్రమం తీవ్రస్థాయికి చేరుకుంది. గత 8 రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనకు శుక్రవారం ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.
మండ్య జిల్లా రైతు సంఘం నాయకుడు దర్శన్ పుట్టణ్ణయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలో సుమారు 2 వేల మందికి పైగా రైతులు పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు తోడు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేఆర్ఎస్ డ్యాం ముట్టడించకుండా పోలీసులు భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి బ్యారికేడ్లు తెప్పించిన పోలీసులు కేఆర్ఎస్ చుట్టు పక్కల ఏర్పాటు చేశారు. కేఆర్ఎస్ ముట్టడించడానికి వచ్చే రైతులను అరెస్టు చేసి తరలించడానికి ప్రత్యేక బస్సులు రప్పించారు.
మండ్య రైతులకు మద్దతుగా మైసూరు వరుణా కాలువ రైతులు తోడుకావడంతో పరిస్థితి అదుపుతప్పింది. మైసూరు వరుణా కాలువ పరిసర ప్రాంతాల రైతులు మండ్య రైతులు భారీ సంఖ్యలో కేఆర్ఎస్ డ్యాం దగ్గరకు చేరుకున్నారు. కేఆర్ఎస్ డ్యాం దగ్గర రైతులు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమిస్తే ఆందోళన చేసే రైతులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేకపోవడంతో కావేరీ నీరు విడుదల చెయ్యాలని గత 8 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. తాము చేస్తున్న ఆందోళన గురించి కనీసం ఒక్క మంత్రి కూడా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే మండ్య, మైసూరు జిల్లా రైతుల కోసం కావేరీ నీరు విడుదల చెయ్యాలని కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ సైతం కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. ముందు జాగ్రత్త చర్యగా కేఆర్ఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.