ఫెడరల్ ఫ్రంట్ అనేది కేసీఆర్ తో కాని పని..! మండి పడ్డ కోదండరాం, దత్తాత్రేయ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ పై రాష్ట్ర నాయకులు విరుచుకు పడ్డారు. బీజేపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, జనసమితి అధినేత కోదండరాం చంద్రశేఖర్ రావు పై మండిపడ్డారు. చంద్రకేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలావరకూ ప్రాంతీయ పార్టీలు బీజేపీ లేదా కాంగ్రెస్కు మద్దతిస్తున్నాయని వివరించారు.
శుక్రవారం దిల్లీలో జాతీయ మీడియాతో దత్తాత్రేయ మాట్లాడుతూ.. 'భాజపా, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారు. ఇలాంటి కూటమి అసాధ్యం. ఎందుకంటే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్కు లేదా బీజేపీకి మద్దతిస్తున్నాయి. చంద్రశేఖర్ రావు లాంటి వ్యక్తిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయన గోడ మీద పిల్లి లాంటి వారు, అవకాశవాది' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మిగతా రెండు విడతలు మే 12, 19 తేదీల్లో జరగనుండగా, ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి.
మొండి వైఖరిని ఎండ గడతాం..! కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మందకృష్ణ..!!
ఇదిలా ఉండగా ఫెడరల్ ఫ్రంట్ అనేది అత్యాశని అది జరిగే పని కాదని జనసమితి అధినేత కోదండరాం తెలిపారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్లేందుకు తెలంగాణ సీఎంచంద్రశేఖర్ రావు ఆడుతున్న నాటకంలో భాగమే కేరళ, తమిళనాడు పర్యటన అని ఆయన ఎద్దేవా చేసారు. దేశంలో అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మహాకూటమిదే కీలక పాత్ర ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక వేళ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరిగితే అందులో చంద్రశేఖర్ రావు, వైయస్ జగన్ మాత్రమే మిగులుతారని కోదండరాం జోస్యం చెప్పారు. ఫ్రంట్ పేరుతో సమయం వృథా చేయకుండా సమస్యలపై దృష్టిపెట్టాలని చంద్రశేఖర్ రావుకు హితవు పలికారు. ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా శనివారం ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కొనసాగిస్తామని కోదండరామ్ స్పష్టం చేసారు.