RSS ఆర్మీ స్కూల్: ఏర్పాటు చేసిన సంఘ్ పరివార్: మదసాలకు ధీటుగా అంటూ.. !
లక్నో: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా ఓ సైనిక పాఠశాలను స్థాపించింది. ఆర్ఎస్ఎస్ ఈ తరహా సైనిక పాఠశాలను ఏర్పాటు చేయబోతుండటం దేశంలో ఇదే మొదటిసారి. ఉత్తర ప్రదేశ్లోని బులంద్షెహర్లో ఈ పాఠశాల ఏర్పాటైంది. ప్రత్యేకంగా ఓ సైనిక పాఠశాలను స్థాపించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అందజేసిన ప్రతిపాదనలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి గుర్తింపును మంజూరు చేసింది.
వచ్చే ఏప్రిల్ నుంచి ఈ పాఠశాల కార్యకలాపాలు ఆరంభం కానున్నాయి. రజ్జూభయ్యా సైనిక్ విద్యా మందిర్ (ఆర్బీఎస్వీఎం) పేరుతో ఈ పాఠశాల ఏర్పాటైంది. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ రజ్జూభయ్యా. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ, ఇండియన్ ఆర్మీ వంటి దేశ రక్షణా రంగంలో కొనసాగుతున్న విద్యాసంస్థల స్థాయిలో బోధనను అందజేస్తామని ఉత్తర ప్రదేశ్ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. పాఠశాల విద్య దశలో నుంచే విద్యార్థుల్లో దేశం పట్ల అంకిత భావాన్ని, దేశం పట్ల భక్తిని రగిలిస్తామని చెప్పారు.
ఇప్పటికే ఈ పాఠశాలలో చేరడానికి 160 దరఖాస్తులు అందాయని సైనిక్ విద్యామందిర్ డైరెక్టర్ కల్నల్ శివ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. మార్చి 1వ తేదీన ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని, అందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మాత్రమే సీట్లను కేటాయిస్తామని అన్నారు. రజ్జూభయ్యా సైనిక్ విద్యామందిర్ పాఠశాలకు అనుమతిని, గుర్తింపును ఇచ్చినందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కృతజ్ఙతలు తెలిపారు.
సీబీఎస్ఈ పాఠ్యాంశాలను తమ పాఠశాలలో బోధిస్తామని, అమరులైన సైనిక కుటుంబాల పిల్లల కోసం ప్రతి తరగతిలోనూ ఎనిమిది సీట్లను రిజర్వ్ చేసి ఉంచినట్లు శివ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఇదిలావుండగా- మదరసాలకు ధీటుగా ఆర్ఎస్ఎస్.. ఈ పాఠశాలను ప్రారంభించిందని, తమ భావజాలాన్ని వ్యాపింపజేయడానికే దీన్ని చేపట్టిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన భావజాలాన్ని వ్యాపింపజేయడానికి ఉద్దేశించినట్లుగా తాము దీన్ని భావిస్తున్నామని విమర్శించారు. అలాంటి పాఠశాలలకు ప్రభుత్వం అనుమతిని ఎలా మంజూరు చేస్తుందని నిలదీస్తున్నారు.