కోవిషీల్డ్ వ్యాక్సిన్.. మూడు కంటైనర్లలో: తరలిన తొలి బ్యాచ్..ఫస్ట్ ఫ్లైట్ అక్కడికే
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్.. రాష్ట్రాలకు తరలింది. మహారాష్ట్ర పుణేలో గల సీరమ్ ఇన్స్టిట్యూట్ కంపెనీ నుంచి మూడు కంటైనర్లలో ఈ వ్యాక్సిన్ మంగళవారం తెల్లవారు జామున తరలించారు. తొలి బ్యాచ్ వ్యాక్సిన్ను దేశ రాజధానికి తీసుకెళ్లారు. ఈ ఒక్కరోజులోనే దశలవారీగా దేశవ్యాప్తంగా 13 వేర్వేరు ప్రాంతాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తారు. ఎస్బీ లాజిస్టిక్ కంపెనీ వాహనాలను దీనికోసం వినియోగిస్తున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్ తరలింపు కార్యకలాపాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పర్యవేక్షించారు.
#WATCH | First consignment of Covishield vaccine dispatched from Serum Institute of India's facility in Pune, Maharashtra. pic.twitter.com/QDiwLXka2g
— ANI (@ANI) January 11, 2021
అందుబాటులో కోవిషీల్డ్, కోవాగ్జిన్
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. కోవిషీల్డ్. దీన్ని తయారీ బాధ్యతలను పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంది. దేశం మొత్తానికీ అవసరమైన వ్యాక్సిన్ డోసులను సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను అత్యవసర సమయాల్లో సామాన్య ప్రజల కోసం వినియోగించడానికి కొద్దిరోజుల కిందటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సీరమ్తో పాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్కు కూడా డీసీజీఏ అనుమతి ఇచ్చింది
పుణే నుంచి ఢిల్లీకి
సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్ డోసులతో తరలిన మూడు కంటైనర్లు నేరుగా పుణే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వాటిని న్యూఢిల్లీ తరలించారు. అక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత.. వాటిని ప్రత్యేక కంటైనర్ల ద్వారా పంపిణీ కేంద్రాలకు చేరవేస్తారు. ఇలా దశలవారీగా 13 వేర్వేరు ప్రాంతాలకు వ్యాక్సిన్ డోసులను తరలింపు కార్యక్రమాన్ని సీరమ్ చేపట్టబోతోంది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను చేపట్టబోతోన్నట్లు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్లను సిద్ధం చేస్తోంది.
హెల్త్ వర్కర్లకు
తొలి విడత వ్యాక్సిన్ హెల్త్ వర్కర్లకు అందిస్తారు. డాక్టర్లు, నర్సులు, ఇతర ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలను ఈ జాబితాలోకి చేర్చారు. తెలంగాణలో సుమారు 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందబోతోంది. హెల్త్ వర్కర్లకు తొలి విడత డోస్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఈ జాబితాలోకి తీసుకొచ్చారు. అనంతరం 50 సంవత్సరాల వయస్సు పైనున్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు. దీనికి అనుగుణంగా తెలంగాణకు వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.
Recommended Video
తెలంగాణలో 139 కేంద్రాల్లో..
తెలంగాణలో 139 కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున తొలి రోజు మొత్తం 13,900 మందికి వ్యాక్సిన్ ఇస్తారు. తెలంగాణకు ఆరు లక్షల డోసులు అందుతాయని తెలుస్తోంది. వాటిని భద్రపర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే పూర్తి చేసింది.