Covaxin:30 ఏళ్ల యువకుడిపై వ్యాక్సిన్ ప్రయోగం..ఫలితం ఏంటో తెలుసా..?
కోవిడ్ -19 విరుగుడు కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్ కొవాక్సిన్ తొలిసారిగా మనుషులపై ప్రయోగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ముందుగా 30 ఏళ్ల యువకుడికి తొలి టీకాను ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ను రెండుగంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నారు వైద్యులు. ఆ తర్వాత అతన్ని ఇంటికి పంపి మరో ఏడు రోజుల పాటు అతని ఆరోగ్య విషయంపై పూర్తిగా మానిటర్ చేయనున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ఆ 30 ఏళ్ల యువకుడికి అన్ని పరీక్షలు నిర్వహించారు. అంతా ఓకే అనుకున్నాకే టీకాను వైద్యులు ఇచ్చారు. కొన్ని రోజుల ముందు వ్యాక్సిన్ను కొంతమంది వాలంటీర్లకు ఇచ్చి హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించిన వైద్యులు తాజాగా క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కొవాక్సిన్ను హైదరాబాదులోని భారత్ బయోటెక్లో రూపొందించారు. ఐసీఎంఆర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ తయారు చేసింది. ఈ మధ్యనే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది.
కొవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా 12 ప్రాంతాలను ఎంపిక చేసింది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. అందులో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కూడా ఒకటి. రెండు దశల ప్రయోగానికి అనుమతిచ్చింది ఐసీఎంఆర్. తొలిదశలో 375 మంది వాలంటీర్లపై కొవాక్సిన్ను ప్రయోగించడం జరుగుతుంది. ఇందులో 100 మంది వాలంటీర్లు ఎయిమ్స్ నుంచే ఉంటారు. ఇక రెండో దశ వ్యాక్సిన్ ప్రయోగం ఎంపిక చేయబడ్డ మొత్తం 12 ప్రాంతాల్లో 750 మంది వాలంటీర్ల పై ప్రయోగించడం జరుగుతుంది.
Recommended Video
తొలి దశ ప్రయోగం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారిపై ప్రయోగించడం జరుగుతుంది. వీరి వయస్సు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లు మధ్య ఉంటుంది. అంతేకాదు ఇతరత్రా జబ్బులు లేని వారై ఉండాలి. గర్భం దాల్చని మహిళలపై కూడా తొలిదశలో ప్రయోగించేందుకు వైద్యులు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండో దశ ప్రయోగం కోసం 12 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న 750 మంది వాలంటీర్లను నియమించుకుంటారు .