చంద్రుపై అడుగు పెట్టబోతున్న తొలి మహిళ... ప్రణాళిక సిద్ధం చేసిన నాసా
చంద్రుడి మీదకు 2024కల్లా వెళ్లి రావడానికి నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఒక మహిళా వ్యోమగామిని కూడా పంపనున్నట్లు నాసా తెలిపింది.
1972 తరువాత మళ్లీ చంద్రునిపై కాలు మోపడానికి రంగ సిద్ధమైంది.
2024కల్లా చంద్రుడి మీదకు వెళ్లి రావడానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల (28 బిలియన్ డాలర్లు) ప్రణాళికను నాసా అధికారికంగా విడుదల చేసింది.
ఆర్టెమిస్ అని పిలుస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా ఇద్దరు వ్యోమగాములు..ఒక స్త్రీ, ఒక పురుషుడు చంద్రుని మీదకు ప్రయాణించనున్నట్లుగా నాసా ప్రకటించింది.
గతంలో ప్రయాణించిన అపోలోలాంటి అంతరిక్ష నౌక 'ఒరాయన్'లో వ్యోమగాముల బృందం ప్రయాణించనుంది. ఈ అంతరిక్ష నౌక, శక్తివంతమైన రాకెట్ 'స్పేస్ లాంచ్ సిస్టం' (ఎస్ఎల్ఎస్) ద్వారా ప్రయాణించనుంది.
ప్రయాణ సన్నాహాల నిమిత్తం ఇప్పటికే యూఎస్ ప్రభుత్వం సుమారు 4.4 వేల కోట్ల రూపాయలను (660 మిలియన్ డాలర్లు) మంజూరు చేసింది. 2021 నాటికి సుమారు 22 వేల కోట్ల రూపాయలను (3.2 బిలియన్ డాలర్లు) మంజూరు చేస్తారని నాసా ఆశిస్తోంది. చంద్రునిపైకి ప్రయాణించే రాకెట్ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి ఇది ఎంతో అవసరమని నాసా అధ్యక్షులు జిమ్ బ్రైడెన్స్టైన్ తెలిపారు.
చంద్రునిపై అడుగు పెట్టబోతున్న మొదటి మహిళా వ్యోమగామి
2019 జూలైలో బ్రైడెన్స్టైన్ సీఎన్ఎన్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో...2024లో మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామి చంద్రునిపై కాలు మోపబోతున్నారని తెలిపారు.
"ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగమై, నాసా ఆస్ట్రోనాట్ కార్ప్స్ విభాగంలో సభ్యత్వం ఉన్న, ప్రతిభావంతమైన మహిళను చంద్రునిపైకి పంపిస్తామని" బ్రైడెన్స్టైన్ తెలిపారు.
ఈ ఇంటర్వ్యూ ఇచ్చిననాటికి 12 మంది మహిళా వ్యోమగాములు క్రియాశీలకంగా ఉన్నారు. వారితోపాటూ ఈ ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న మరొక 5 గురు మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిలో ఎవరు 2024నాటికి చంద్రునిపై ప్రయాణానికి తగిన శిక్షణ పూర్తి చేయగలుగుతారో వేచి చూడాల్సిందే.
ఒరాయన్లో ప్రయాణించబోయే ఆర్టెమిస్ బృందాన్ని ఎప్పుడు ఎన్నుకుంటారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ప్రయాణానికి కనీసం రెండేళ్ల ముందే సభ్యులను ఎన్నుకుంటామని, ముందుగానే బృందాన్ని తయారుచేసుకోవడం ప్రేరణనిస్తుందని" నాసా అధ్యక్షులు తెలిపారు.
ఆర్టిమెస్ ప్రోగ్రాంలో మూడు దశలు ఉంటాయని నాసాలోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అధ్యక్షులు క్యాథీ లూడర్స్ తెలిపారు.
మొదటి దశ ఆర్టిమెస్-1లో కేవలం రాకెట్ను మాత్రమే పైకి పంపించి పరీక్షిస్తారు.
రెండవ దశ ఆర్టిమెస్-2లో వ్యోమగాములు కూడా వెళతారు.
చివరిగా, మూడవ దశ ఆర్టిమెస్-3లో రాకెట్ చంద్రునిపైకి ప్రయాణిస్తుంది. చంద్రుని సమీపిస్తుండగా ఒరాయన్, ఎస్ఎల్ఎస్ రాకెట్ నుంచి విడిపోతుంది. అక్కడినుంచీ చంద్రుని చేరి, తిరిగి భూమికి వచ్చేవరకు వ్యోమగాములే స్వయంగా ఒరాయన్ను నడుపుతూ ప్రయాణం చేస్తారు.
ఆర్టిమెస్ ప్రయోగం తరువాత, ఈ దశాబ్దం చివరిలో చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చెయ్యాలని నాసా యోచిస్తోంది. చంద్రునిపై నీరు-మంచు సంగ్రహించే అవకాశాలేమైనా ఉన్నాయేమో పరీక్షించనున్నట్టు నాసా తెలిపింది. ఈ ప్రయోగాలు విజవంతమైతే అంతరిక్ష నౌకకు కావలసిన ఇంధనాన్ని భూమిపైనుంచి తీసుకువెళ్లడంకంటే చవగ్గా చంద్రునిపై తయారుచేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- దేవతలు తెల్లగానే ఎందుకుండాలి?
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
- ఫిన్సెన్ ఫైల్స్: హెచ్ఎస్బీసీ 'పాంజి' స్కీమ్ కుంభకోణానికి సహకరించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)