శ్రీలంక సేనల కాల్పులు: రామేశ్వరం యువకుడి కాల్చివేత, ఉద్రిక్తత !
శ్రీలంక సేనలు తమిళనాడు జాలర్లపై కాల్పుల వర్షం కురిపించడంతో రామేశ్వరంకు చెందిన బిషో (22) అనే యువకుడి ప్రాణాలు గాలిలోకలిసిసోయి మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో రామేశ్వరంలో ఉద్రిక్త పరిస్థితులు .
రామేశ్వరం: తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు వీరంగం సృష్టిస్తున్నారు. శ్రీలంక సేనలు జరిపిన కాల్పుల్లో రామేశ్వరంకు చెందిన బిషో (22) అనే యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిసోయాయి. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో రామేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం రామేశ్వరంలో నుంచి దాదాపు 400 మంది చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. సాయంత్రం చాపల వేట ముగించుకుని పడవల్లో రామేశ్వరం వైపు బయలుదేరారు. మార్గం మధ్యలో పాల్క్ స్ట్రోక్ ప్రాంతంలో శ్రీలంక సేనలు అటుగా వచ్చాయి.
అంతే ఒక్క సారిగా తమిళ జాలర్ల మీద తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో బిషోతో సహ మరో ఇద్దరికి తూటాలు దూసుకుపోవడంతో తీవ్ర గాయాలైనాయి. వెంటనే వారిని రామేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై బిషో మరణించాడు.
తీవ్రగాయాలైన మరో ఇద్దరు జాలర్లు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నిత్యం శ్రీలంక సేనలు విరుచుకుపడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని, మాకు న్యాయం జరిగే వరకు మృతదేహం ఇక్కడి నుంచి తీసుకు వెళ్లే ప్రసక్తేలేదని తమిళనాడు జాలర్ల సంఘం నాయకులు ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నారు.
శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే. స్టాలిన్ చాల రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో శ్రీలంక సేనలు తమిళ జాలర్ల పై కాల్పులు జరిపి ఒకరి ప్రాణాలు తీయ్యడంతో జాలర్లు చాపల వేటకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. తమిళనాడు ప్రభుత్వ తీరుపై జాలర్ల అసోసియేషన్ సంఘాలు మండిపడుతున్నాయి.