గోవాలో ఐఎస్ఐఎస్ అనుచరుడి విచారణ
గోవా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ విదేశీయుల మీద దాడులు చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడిని గోవాలో అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇతను విదేశీయుల మీద దాడులు చెయ్యడానికి ప్లాన్ వేశాడని వెలుగు చూసింది.
గోవాకు వచ్చే విదేశీయుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న గోవా ఉగ్రవాద నిరోదక దళం అధికారులు, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు గోవాలో ఓ యువకుడిని అరెస్టు చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు దాడులు చేస్తారని సమాచారం సేకరించిన ఎన్ఐఏ అధికారులు ఇటీవల ముంబై, బెంగళూరు, మంగళూరు, హైదరాబాద్, పూణె తదితర ప్రాంతాల్లో పలువురిని అరెస్టు చేశారు.
ముంబైకి చెందిన ఐఎస్ఐఎస్ భారత్ కింగ్ పిన్ ముదబిర్ ముస్తాక్ షేక్ ఇచ్చిన సమాచారం మేరకు గోవాలో విదేశీయుల మీద దాడులు చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని అధికారులు సమాచారం సేకరించారు. ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రజలను వీరు టార్గెట్ చేసుకున్నారని గుర్తించారు.
గోవాలో అరెస్టు అయిన యువకుడు మహారాష్ట్రలో కార్లు చోరీ చేశాడని గుర్తించారు. మహారాష్ట్రలో కార్లు చోరీ చేసే గ్యాంగ్ లతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. చోరీ చేసిన కార్లు ఉపయోగించి విదేశీయుల మీద దాడులు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు.
అయితే గోవాలో అరెస్టు చేసిన యువకుడి పేరు, వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. అతనిని విచారణ చేసి ఇంకా ఎవరైనా అతని అనుచరులు గోవాలో తలదాచుకున్నారా అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.