నల్లకుబేరులు ఎంత బంగారం కొంటున్నారు ? ఐటీ
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ అధికారుల కళ్లు కప్పి నల్లధనంతో బంగారం కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న నల్లకుబేరుల మీద ఐటీ శాఖ అధికారులు కన్ను వేశారు. బంగారం కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా పాన్ కార్డు చూపించాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ రూ. 1,000, రూ.500 నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పాత నోట్లు మార్చుకోవడానికి శుక్రవారం అర్దరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పించారు.
ఇదే సమయంలో బ్యాంకుల్లో రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారి వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రూ. 2.50 ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయని నల్లకుబేరులు ఆందోళన చెందుతున్నారు.
అయితే బ్లాక్ మనీని బంగారంగా మార్చాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్లే బుధ, గురువారం రోజుల్లో బంగారం కొనుగోలు చెయ్యడానికి పోటీ పడ్డారు. డిమాండ్ ఎక్కువగా ఉందని పసిగట్టిన బంగారం వ్యాపారులు ఒక్క సారిగా బంగారు రేటు పెంచేశారు.
అయినా వెనక్కి తగ్గని నల్లకుబేరులు బంగారు కొనుగోలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇలా నల్లధనంతో బంగారు కొనుగోలు చేస్తున్న వారి వివరాలు చెప్పాలని బంగారు వ్యాపారులకు ఐటీ శాఖ సూచించింది.
రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే !
అనేక మంది దాదాపు రూ. 2 లక్షలు ఇంట్లో పెట్టుకుని ఉంటారని ఆదాయపు పన్ను శాఖ అధికారి హస్ముఖ్ ఆదియా అంటున్నారు .అయితే వారు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30వ తేది మధ్యలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.
రూ. 2.50 లక్షల కంటే తక్కువ మొత్తంలో బ్లాంకుల్లో డిపాజిట్ చేస్తే వారు ఆదాయ పన్ను పరిధిలోకి రారని హస్ముఖ్ ఆదియా స్పష్టం చేశారు. మొత్తం మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పుడు ఎక్కువగా ఎవరు బంగారం కొనుగోలు చేస్తున్నారు అని ఆరా తీస్తున్నారు.