ఆంగ్లానికి అవమానం కాదు, దేశం గుండె: నక్వీ
న్యూఢిల్లీ: హిందీ భాషను ప్రోత్సహించాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని బిజెపి సమర్థించింది. దేశాన్ని సమైక్యం చేయాలనే ఉద్దేశం అందులో ఉందని, అది ఆంగ్ల భాషను అవమానించడం కాదని బిజెపి ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.
హిందీ జాతీయ భాష అని, అది దేశం హృదయమని, హిందీకి ప్రాధాన్యం ఇవ్వడం ఆంగ్ల భాషను అవమానించడం కాదని ఆయన అన్నారు. హిందీని, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనని ఆయన అన్నారు.
తమిళం, తెలుగు, మలయాళం, గుజరాతి, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల మిశ్రమంతో హిందీ ఏర్పడిందని ఆయన అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అనుసంధానానికి హిందీని ప్రోత్సహించాలనే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, రామ్ మనోహర్ లోహియా వంటివారి ప్రయత్నాలను గత ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
హిందీని ప్రోత్సహించడానికి ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీతో ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. హిందీ, ఇంగ్లీషు భాషల మధ్య వైరుధ్యం లేదని చెప్పారు. హిందీకి, ఇతర భాషలకు ఇంతకు ముందు తగిన స్థానం లభించలేదని, అందువల్ల ఇప్పుడు హిందీని వ్యతిరేకించడం సరికాదని ఆయన అన్నారు.