ఐఏఎస్ డీకే రవి కేసు: దిగి వచ్చిన సిద్దరామయ్య
బెంగళూరు: వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ అనుమానాస్పదస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవి కేసులో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మనస్సు మార్చుకునింది. ఆ కేసు దర్యాప్తుకు ఇంతకు ముందు విధించిన గడువు విషయంలో సిద్దరామయ్య వెనక్కి తగ్గారు.
మార్చి 16వ తేదిన ఐఏఎస్ అధికారి డి.కె. రవి బెంగళూరులోని కోరమంగల సమీపంలోని అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు ఒత్తిడి చెయ్యడంతో సిద్దరామయ్య కేసు సీబీఐకి అప్పగించారు.
అదే సమయంలో సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో ఐఏఎస్ అధికారి రవి కేసు దర్యాప్తు మూడు నెలలలో పూర్తి చెయ్యాలని సిద్దరామయ్య డెడ్ లైన్ విధించారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ మూడు నెలలలో పూర్తి చేయలేమని చెప్పారు.
సోమవారం రవి కేసు దర్యాప్తు మూడు నెలలలో పూర్తి చేయలేమని సీబీఐ అధికారులు కుండలు బద్దలు కొట్టారు. ఖంగుతిన్న రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది. ప్రతిపక్షాలు మళ్లీ ఆందోళన చేస్తాయని పసిగట్టి వెంటనే స్పందించారు.
ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు దర్యాప్తుకు తాము మూడు నెలలు డెడ్ లైన్ విధించామని, నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసుకోవచ్చని సోమవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రవి కేసు దర్యాప్తు విషయంలో ఇక మీదట తాము జోక్యం చేసుకోమని పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ లేఖను సోమవారం కేంద్ర ప్రభుత్వానికి ఫ్యాక్స్ చేశామని అధికారులు తెలిపారు.