తాత కల మనవడు నెరవేరుస్తాడా..!మస్తుగా మరాఠీ రాజకీయం..!బీజేపి సీఎం సీటు ఒదులుకుంటుందా..?
ముంబాయి/హైదరాబాద్ : సాహసాల పురిటి గడ్డ.. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకునే మరాఠీల అడ్డలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. స్నేహం చేసినప్పుడు సహనం ఉండాలి. మరి ఆ సహనానికి క్షణం క్షణం పరీక్షలు ఎదురైతే ఆ స్నేహం నిలబడటం కష్టం. ఆదిపత్యపోరులో పైచేయి కోసం ఎంతకన్నా తెగించే పరిస్ధితులు నెలకొంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్దితులే మరాఠీ నేల మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్నాయి. రాజకీయంగా బీజేపి, శివసేన పార్టీలు మిత్రపక్షమైనప్పటికి బీజేపి అవలంభిస్తున్న కొన్న విదానాలను శివసేన విమర్శిస్తుంటుంది. పరస్పరం భావసారూప్యం ఉన్న పార్టీలైనప్పటికి కొన్ని అంశాల్లో బీజేపితో శివసేన విసిగిపోయిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్బాలన్నింటికి రాజకీయంగా తెర దించాలని శివసేన భావిస్తోంది. అందుకోసం ముఖ్యమంత్రి పీఠాన్ని డిమాండ్ చేస్తోంది శివసేన.
50-50 ఫార్ములాకు ఓకే: అధికారం చెరి సగం..సీఎంగా ఎవరుండాలనేది తేలాలి: శివసేన చీఫ్ వెల్లడి
సీఎం సీటు కోసం మిత్రపక్షాల పోరు.. మరాఠా పీఠం శివసేనకా.. బీజేపీకా..?
తాజాగా జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన అనూహ్యంగా పుంజుకుంది. ప్రతిసారి బీజేపికి వెన్నుదన్నుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉండే శివసేన ఇప్పుడు ముఖ్యమంత్రి సీటును డిమాండ్ చేస్తోంది. అందుకు తగ్గట్టే ముంబాయిలోని వర్లీ ప్రాంతంలో ఆదత్య థాక్రే సీఎం కావాలంటూ పోస్టర్లు వెలిసాయి. శివసేనను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలన్నది శివసేన వ్యవస్ధాపకుడు, దివంగత బాల్ థాక్రే చిరకాల స్వప్నంగా ఉండేది. ఆ కల ఇప్పుడు మనవడు ఆదిత్య థాక్రే రూపంలో నెరవేరబోతున్నట్టు తెలుస్తోంది. ఐతే 105సీట్లతో ఉన్న బీజేపి శివసేనకు అంత తేలిగ్గా సీఎం పదవి ఒదిలేస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సీఎం సీటు కావాలని శివసేన డిమాండ్..! బీజేపి ఏం చేయబోతోంది..!!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పెద్ద రాష్ట్రం, వాణిజ్య రాజధాని ముంబాయి కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో రాజకీయంగా పార్టీలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికారంలో బీజేపీ-శివసేన కూటమిలో శివసేన గతం కన్నా కూడా భారీ గా పుంజుకుంది. అదే సమయంలో తాము రైతుల కోసం మంచి ఫథకాలను తీసుకొచ్చామని చెప్పుకొన్న బీజేపీకి సీట్లు, ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. కేంద్రం అమల్లోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రబావం మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇక్కడ మొత్తం 288 సీట్లలో బీజేపీ కేవలం 105 సీట్లకే పరిమితం కావడం రాజకీయాల్లో చర్చకు దారితీసింది. బీజేపీకి మిత్రపక్షమైన శివసేన భారీ స్థాయిలో పుంజుకుంది. 56 సీట్లను కైవసం చేసుకోగలిగింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలోనూ శివసేన పైచేయి సాధించాలని ప్రయత్నిస్తోంది.
బాల్ థాకరే కలను ఆదిత్య థాక్రే నెరవేరుస్తాడా..!రసవత్తంగా మారిన మహారాష్ట్ర రాజకీయం..!!
ఈ క్రమంలోనే తమకు సీఎం సీటును ఇవ్వాలని అదే సమయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ కేబినెట్ బెర్తులు కూడా కావాలనే షరతు పెడుతుండడం విశేషం. ఇక ఇదే వ్యవహారంలో బీజేపీ పూర్తిగా చతికిల పడిందనే చెప్పాలి. ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ, అనేక పథకాలను తెరమీదికి తెచ్చామన్న పార్టీ ఇప్పుడు బలమైన ప్రభావం చూపలేకపోవడం దారుణంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో మునుపెన్నడూ లేని విధంగా శివసేన పుంజుకోవడం, అధికారంలోకి రావాలనే దివంగత బాల్ థాక్రే కలలను నిజం చేయాలని శివసేన పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తమకు సీఎం సీటు ఇచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని తాజాగా ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామం బీజేపీకి శరాఘాతంగా పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
అనూహ్యంగా పుంజుకున్న శివసేన..! ఆదిత్యా థాక్రే సీఎం అంటూ పోస్టర్లు..!!
మహారాష్ట్రలో బీజేపీ ఓట్లు, సీట్లు తగ్గిపోవడం, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మరోసారి ఇక్కడ అధికారం దక్కించుకునేందుకు తనను విభేదిస్తున్న శివసేనతోనే స్నేహపూర్వకంగా ముందుకు వెళ్లడం వంటి అంశాలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బీజేపీ అఖండ విజయం సాధించిన ఏడాదే జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన శివసేన విపరీతంగా బలం పుంజుకోవడం, ఎన్సీపీ సుమారు 50 సీట్లు తెచ్చుకోవడం దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోలేదు అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. బీజేపి సాహసోపేత నిర్ణయాలు కూడా ప్రజల్లో ప్రభావం చూపలేదనే అంశం తేటతెల్లమైంది. సిద్దాంతాలు ఒకటైనా బీజేపి విధానాలను వ్యతిరేకిస్తున్న శివసేన లాంటి పార్టీ మహారాష్ట్ర లో గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.