మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ లు..! బీజేపి హాండ్స్ అప్ ! రంగంలోకి సోనియా..!!
ముంబాయి/హైదరాబాద్: మరాఠా రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పార్టీల మధ్య ఏకాభిప్రయాలు కుదరక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎప్పుడూ లేని కాలాతీతం చోటుచేసుకుంటోంది. దేశం మొత్తం చేత కీర్తించబడుతున్న బీజేపి మిత్రపక్షమైన శివసేనతో మాత్రం స్నేహ పూర్వకంగా ముందుకు వెళ్లలేక పోతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శత్రువులు మిత్రులుగా మారే సంకేతలు కూడా వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు నుంచి బీజేపి తప్పుకోవడంతో సోనియా గాంధీ రంగంలోకి దిగి పరిస్థితులను చేతులోకి తీసుకోబోతున్నారు. దీంతో గవర్నర్ విధించిన డెడ్ లైన్ లోపు ఓ సానుకూల నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తాత కల మనవడు నెరవేరుస్తాడా..!మస్తుగా మరాఠీ రాజకీయం..!బీజేపి సీఎం సీటు ఒదులుకుంటుందా..?
మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభన.. కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన మంతనాలు..
సోమవారం సాయంత్రంలోపు మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ చేతులు ఎత్తేయడంతో ఆ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆహ్వానించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ వెనక్కి తగ్గిన విషయం కూడా తెలిసిందే. గవర్నర్ను కలిసిన ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పారు.
శివసేనకు గవర్నర్ పిలుపు.. కాంగ్రెస్ ఏంచేయబోతుంది..?
మిత్రపక్ష మైన శివసేనతో అనేక సార్లు జరిపిన మంతనాలు విఫలం చెందడంతో బీజేపి విసిగిపోయినట్టు తెలుస్తోంది. చివరికి తమకు సంఖ్యాబలం లేనందున ప్రభుత్వ ఏర్పాటు చేయలేకపోతున్నామనే నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తారో లేదో సోమవారం రాత్రి 7.30లోపు తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనకు సూచించారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105, శివసేనకు 56, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 సీట్ల చొప్పున గెలుపొందాయి. బీవీఏ పార్టీ 3, మజ్లిస్ 2, ప్రహర్ జనశక్తి 2, ఇండిపెండెంట్లు 13 మంది గెలిచారు.
మహారాష్ట్ర సీఎం పీఠం మాదే.. డెడ్ లైన్ పై మండిపడ్డ సంజయ్..
మహారాష్ట్ర సీఎం పీఠంపై శివసేన ఆసీనులవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజారిటీ ఉందని ఇప్పటి వరకు గొప్పలు చెప్పిన బీజేపీ, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గడం అంటే మహారాష్ట్ర ఓటర్లను అవమాన పరచడమేనన్నారు. ఎన్నికలకు ముందు సీఎం పీఠం చెరిసగం పంచుకోవాలని నిర్ణయించి, ఫలితాల తరువాత మాట మార్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుపుతున్నామని సంజయ్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తక్కువ సమయం ఇచ్చారని, ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర అని సంజయ్ ఆరోపించారు.
కేంద్ర క్యాబినెట్ నుంచి శివసేన ఔట్.. మహారాష్ట్ర పరిణామాలే కారణం అంటున్న సావంత్..
కేంద్ర క్యాబినెట్ లో కొనసాగుతున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సావంత్ అధికారికంగా ప్రకటించారు. శివసేన, బీజేపీ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో శివసేన ఇతర పార్టీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కేంద్ర క్యాబినెట్ నుంచి అరవింద్ సావంత్ వైదొగాల్సి వచ్చింది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రపక్షమైన శివసేన కు మంత్రి పదవి ఇచ్చారు. ఐతే మహారాష్ట్రలో నెలకొన్న పరస్పర విరుద్ద వాతావరణం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి తప్పుకోక తప్పలేదని సావంత్ చెప్పుకొస్తున్నారు.