దండలు మార్చుకుంటుండగా: వరుడికి నో చెప్పి, గెస్ట్ను పెళ్లాడిన యువతి
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్లో పెళ్లి తంతు సగం ముగిశాక ఓ పెళ్లి కూతురు వరుడిని కాకుండా అతిథిగా వచ్చిన యువకుడిని పెళ్లి చేసుకున్న సంఘటన జరిగింది. కిషోర్ అనే 25 ఏళ్ల యువకుడికి 23 ఏళ్ల యువతితో మోరాబాదులో వివాహం జరుగుతోంది.
పెళ్లి తంతులో భాగంగా దండలు మార్చుకుంటుండగా.. మూర్చరోగంతో బాధపడుతున్న వరుడు కిషోర్ వరమాల వేస్తూ కుప్పకూలిపోయాడు. పెళ్లి కుమారుడికి మూర్చ రోగం ఉందని తెలిసిన పెళ్లి కూతురు, ఆమె బంధువులు వరుడి బంధువుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం అదే ముహూర్తానికి హర్పాల్ సింగ్ అనే యువకుడిని పెళ్లి కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో అతిథిగా వచ్చిన హర్పాల్ సింగ్ జీన్స్, లెదర్ జాకెట్ వేసుకొని ఉన్నాడు. అతను మొదట ఆశ్చర్యపోయినా తర్వాత పెళ్లాడాడు.
మరోవైపు, కిషోర్ను బంధువులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆసుపత్రిలో కోలుకున్న కిషోర్ తిరిగి వచ్చి అడిగాడు. అయితే, ఆ యువతి ససేమీరా అంది. కిషోర్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పెద్దలు వారించడంతో వెనక్కి తగ్గారు.