11 నిమిషాల్లో ముంబై నుంచి పుణేకు! ‘హైపర్ లూప్’లో గంటకు 1200 కి.మీ. వేగంతో!!
ముంబై నుంచి పుణేకు రోడ్డు మార్గాన వెళితే కనీసం మూడు గంటలు పడుతుంది. అదే విమానంలో అయితే 20 నిమిషాలు.. మరి రైలుతో వెళితే.. జస్ట్ 11 నిమిషాలు.. అంతే!
ముంబై: రాబోయే రోజుల్లో మీరు ముంబై నుంచి పుణేకు కేవలం 11 నిమిషాల్లో ప్రయాణించగలరు. అవును, మీరు చదివింది నిజమే. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో పరుగులు తీసే రవాణా వ్యవస్థ మనదేశంలోనూ రానుంది.
ముంబై-పుణే మధ్య 'హైపర్ లూప్' రైలును ప్రవేశపెట్టేందుకు పుణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎంఆర్డీఏ) సన్నాహాలు చేస్తోంది. మాములుగా ముంబై నుంచి పుణేకు రోడ్డు మార్గం మీదుగా వెళితే కనీసం మూడు గంటల సమయం పడుతుంది.
అదే విమానంలో వెళితే 20 నిమిషాల సమయం పడుతుంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన 'హైపర్ లూప్ ట్రాన్స్మేషన్ టెక్నాలజీ' అనే కంపెనీకి చెందిన నిపుణుల బృందం పీఎంఆర్డీఏ పరిధిలో పర్యటించింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పేందుకు ప్రాథమికంగా సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఏమిటి ఈ 'హైపర్ లూప్'?
స్పేస్ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు,ప్రముఖ పెట్టుబడిదారుడు ఇలాన్ మాస్క్ ఈ హైపర్ లూప్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని 2013లో ప్రపంచానికి పరిచయం చేశారు. గంటకు 1,220 కి.మీ. వేగంతో పరుగులు తీసే ఈ రైలు లూప్లో ప్రయాణికులు కూర్చుంటారు. దీని మార్గం క్యాప్సూల్ లేదా ట్యూబ్ లేదా సొరంగం లాగా ఉంటుంది. అందులోంచి రైలు దూసుకెళ్తుంది. క్యాప్సుల్ పొడవు 30 మీటర్లు, వెడల్పు 2.7 మీటర్లు, బరువు సుమారు 20 టన్నుల వరకు ఉంటుంది.
దేశంలోనే తొలిసారిగా..
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే దేశంలోనే తొలిసారిగా ముంబై నుంచి పుణే మధ్య హైపర్ లూప్ రైలు పట్టాలెక్కనుంది. దుబాయ్లోని అబుదాబీ, రష్యాలోని మాస్కో, చైనా ఇలా మూడు దేశాల్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కంపెనీ హైపర్ లూప్ పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోడీ దీనిని మన దేశంలో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మనదేశంలో సాధ్యమేనా?
ఇది మన దేశంలో సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఏ ఏ నగరాల మధ్య దీన్ని చేపట్టవచ్చు? అనే విషయాలపై 'హైపర్ లూప్ ట్రాన్స్మేషన్ టెక్నాలజీ' కంపెనీ అధ్యక్షుడు బీబాప్ గెస్ట్రాతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటీ అయి చర్చించారు. ముంబై-పుణే నగరాల మధ్య ఈ హైపర్ లూప్ను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఉందని నితిన్ గడ్కారీ అభిప్రాయడ్డారు. దీంతో కంపెనీ బృందం పీఎంఆర్డీయే పరిధిలో పర్యటించింది.