మైసూరు కోర్టు ఆవరణంలో బాంబు పేలుడు
మైసూరు: సాంసృతిక నగరంగా పేరు తెచ్చుకున్న మైసూరులో బాంబు పేలుడు సంభవించింది. సోమవారం మైసూరు నగరంలోని కోర్టు ఆవరణంలో ఉన్న బాత్ రూంలో ఈ పేలుడు జరిగింది.
సోమవారం మైసూరు నగరంలోని కోర్టు అవరణంలో కక్షిదారులు, విచారణకు హాజరైన వారు, పోలీసులు అధిక సంఖ్యలో ఉన్నారు. సాయంత్రం ఒక్క సారిగా కోర్టు ఆవరణంలో భారీ శభ్దంతో పేలుడు సంభవించింది.
కోర్టు ఆవరణంలో ఉన్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యదళం బలగాలు, పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాంబు పేలుడుతో బాత్ రూం తలుపులు, కిటికీలు ద్వంసం అయ్యాయి. బాత్ రూంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నాటు బాంబు వలనే పేలుడు సంభవించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
పేలుడు సంభవించిన పరిసర ప్రాంతాల్లో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. సాయంత్రం 4.15 నుంచి 4.25 గంటల మధ్యలో బాంబు పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ బాంబు పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు.