మోడీ కార్యాలయం నుంచి పాక్కు లేఖ
న్యూఢిల్లీ: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లు ఇవ్వాలని పాకిస్థాన్ భారత్ కు మనవి చేసింది. ఈ విషయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు లేఖలు పంపించాలని అధికారులకు సూచించారు.
భారత ప్రధాని కార్యాలయం నుంచి నేరుగా ఎఫ్ఐఆర్ ప్రతులను పాక్ కు పంపించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించి పాక్ కఠిన చర్యలు తీసుకునే వరకూ ఇరు దేశాల మధ్య చర్చలు ఉండవని భారత్ తేల్చి చెప్పింది. పాక్ లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లు ఇవ్వాలని భారత్ పాక్ కు లేఖ వ్రాసింది.
పఠాన్ కోట్ ఉగ్రదాడికి కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ ను డిమాండ్ చేసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించి జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాదుల మీద పాక్ ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత చర్చల గురించి ఆలోచిస్తామని భారత్ అంటున్నది.
"మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, అయితే మీరు ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని మాకు పూర్తి వివరాలు తెలిసిన తరువాత ఇరు దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల సమావేశం గురించి ఆలోచిస్తామ"ని భారత్ తేల్చి చెప్పింది.
అయితే పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు మనం తేల్చి చెప్పలేమని భారత్ అంటున్నది. భారత్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ నిత్యం పాక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారని భారతదేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది.