మంచి వక్త ప్లస్ యాజిటేటరే కాదు.. మాజీ క్రికెటర్ హార్దిక్పటేల్
అహ్మదాబాద్: గుజరాత్లో అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్ పటేల్.. ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఆయన మంచి వక్త. కళాశాల విద్యను అభ్యసించే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా వ్యవహరించారు. అధికార బీజేపీని ముప్పు తిప్పలు పెడుతూ ముందుకు సాగుతున్న హార్దిక్ పటేల్.. విద్యార్థి దశ దాటుతున్న దశలో 'సర్దార్ పటేల్ గ్రూప్'లో చేరిక ఎవ్వరినీ ఆశ్చర్య పర్చలేదు. గుజరాత్లో పట్టు గల యువ నేతగా హార్దిక్ పటేల్ ప్రస్తుతం ఇంటికి దూరంగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని చుట్టేస్తూ కమలనాథులకు వ్యతిరేకంగా సమర భేరి మోగిస్తున్నముందుకు సాగుతున్న యువ నేత నెలల తరబడి ఇంటికి దూరంగా జీవిస్తున్నారు.
24 ఏళ్ల యువ నాయకుడిగా హార్దిక్ పటేల్కు ప్రస్తుతం ఇంట్లో ఒక పూట భోజనం కూడా చేసే తీరిక లేదు. కానీ ఆయన తల్లిదండ్రులకు ఆందోళన కలిగించలేదు. విద్యార్థిగా హార్దిక్ పటేల్ క్రికెటర్ కావాలని కలలు కన్నారు. క్రికెట్ కోసం శిక్షణ కూడా పొందాడు. ఇది ఒక జూనియర్ క్రికెటర్గా ఎదిగేందుకు దోహద పడేదని అంతా భావించారు.
వేల మంది పాటిదార్ యువత ఆందోళన బాట
కానీ 2015 వేసవిలో పరిస్థితి మారిపోయింది. వేల మంది పాటిదార్ యువత ఉద్యోగాల కోసం ఆందోళన బట్టారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం పాటిదార్ యువత చేపట్టిన ఆందోళన హింసకు దారి తీయడంతో జాతీయ రాజకీయాలను ఆకర్షించింది. ఒక్కసారిగా హార్దిక్ పటేల్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. అకస్మాత్తుగా రాజకీయ నాయకుడిగా మార్చేసింది. ఇంతకుముందు యువ క్రికెటర్గా కూడా ఇంటికి దూరంగా ఉండేవారు. ఆయన తండ్రి భరత్ భాయి పటేల్ సబ్ మెర్సిబుల్ పంపుల వ్యాపారం చేశారు. కానీ రెండేళ్లుగా పరిస్థితి మొత్తం మారిపోయింది. మంచి వక్తగా హార్దిక్ పటేల్ తొలుత సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్పీజీ) లో సభ్యుడిగా.. తర్వాత పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్గా సోషల్ మీడియాలో హోరెత్తించారు.
ప్రదర్శనలకు అడ్డు చెప్పిన పోలీసులతో ఘర్షణలకూ వెనుకాడని నైజం
2015 నుంచి పాటిదార్ యువతను ఆర్గనైజ్ చేయడంలో అంతకంతకు మించి సమయం కేటాయించారు. 2015 జూలైలో పాటిదార్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కల్పన కోసం ‘పాస్' స్థాపించినప్పటి నుంచి రోజులు, నెలల తరబడి ఇంటికి దూరంగా గడుపుతున్నారు. వేల మంది పాటిదార్ యువత రిజర్వేషన్ల కోసం ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలకు అడ్డు చెప్పిన పోలీసులతో ఘర్షణకు దిగారు. వాహనాలకు నిప్పంటించారు. రాజకీయంగా పలుకుబడి గల పటేళ్లు.. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ల కోసం ప్రకంపనలు స్రుష్టించారు.
60కి పైగా అసెంబ్లీ స్థానాల్లో పాటిదార్ల ఓటింగ్ కీలకం
పాటిదార్లలో ఉపకులాల్లో ఒక్కటైన కడ్వా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హార్దిక్ పటేల్. కడ్వా పటేళ్లంతా వ్యవసాయం, చిన్నపాటి వ్యాపారంతో జీవనం సాగిస్తున్న వారే. ఇలా ఆందోళనకు శ్రీకారం చుట్టి.. పటేళ్లను సంఘటితం చేసిన హార్దిక్ పటేల్పై ఆందోళనలో జరిగిన హింస సాకుగా గుజరాత్ పోలీసులు రెండు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. రాష్ట్ర జనాభాలో పాటిదార్లు 12 శాతంగా ఉన్నారు. 60కి పైగా అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రభావితం చేయగల సత్తా పాటిదార్లకు ఉన్నది.
సెక్స్ సీడీలు విడుదలైనా హార్దిక్ డోంట్ కేర్
1990వ దశకం నుంచి సంప్రదాయంగా బీజేపీకి మద్దతు తెలుపుతూ వచ్చిన పాటిదార్లు.. రిజర్వేషన్లపై ఆగ్రహంతో కమలనాథులకు దూరమయ్యారు. ఇటీవల హార్దిక్ పటేల్పై సెక్స్ వీడియో సీడీలు లీకైనా ఆయన దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పూర్తిగా ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్న హార్దిక్ పటేల్.. చివరిసారిగా దీపావళి పండుగ నాడు ఇంటికి వెళ్లారని ఆయన సన్నిహితుడు దినేశ్ బాంభానియా చెప్పారు. హార్దిక్ పటేల్తోపాటు రెండు దేశ ద్రోహం కేసులను ఎదుర్కొన్న దినేశ్.. హార్దిక్కు సన్నిహితుడు.
ఆరు నెలల పాటు ఉదయ్పూర్లో ప్రవాసం
దేశ ద్రోహం కేసులో అరెస్టయిన హార్దిక్ పటేల్.. సూరత్ జైలులో తొమ్మిది నెలల పాటు, ఉదయ్పూర్లో ఆరు నెలల పాటు ప్రవాస జీవితం గడిపి గత జనవరిలో అహ్మదాబాద్కు వచ్చారు. విరాంగాంలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన హార్దిక్ పటేల్ అను క్షణం పటేళ్లతో మమేకం కావడానికే ప్రాధాన్యం ఇచ్చారు. గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మోటార్ బైక్, టయోటా ఫార్చూనర్, ఐ ఫోన్ తో విలాస జీవనం సాగించే వారు. కానీ కొద్ది నెలల పాటు అహ్మదాబాద్ నగరంలో కొద్ది రోజులు బంధువుల ఇంట బస చేసిన హార్దిక్ పటేల్.. తర్వాత మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఒక ఇంటిలో జీవిస్తున్నారు. ఈ ఇంటిలో హార్దిక్, ఆయన అనుయాయులు మాత్రమే కలిసి ఉంటున్నారు. హౌజింగ్ స్కీంలో తాను పొందిన ఇంటిపైనా ప్రభుత్వం వివాదం రాజేసిందని హార్దిక్ పటేల్ మండి పడ్డారు.
ఆచితూచి ముందుకు సాగుతున్న హార్దిక్
గత జనవరిలో అహ్మదాబాద్ నగరానికి వచ్చిన హార్దిక్ పటేల్ ఇప్పటివరకు 325కి పైగా బహిరంగ సభలలో పాల్గొన్నారని దినేశ్ బాంభానియా పేర్కొన్నారు. ‘ప్రతిరోజూ ఉదయం ఇంటిలో తయారుచేసే భాక్రీ (గుజరాతీ బెడ్), టీ తనకు ఇష్టమైన అల్ఫాహారం అని, కానీ ప్రచారం వల్ల ఎంతో ఇష్టమైన వాటికి దూరం అవుతున్నానని చెప్పారు. దేశ ద్రోహం కేసులో విడుదలైన తర్వాత స్వేచ్ఛగా తిరిగొద్దని స్నేహితులు చెప్పిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాకీటాకీలు వాడుతూ ఆయా మార్గాల్లో ప్రయాణ సమయాల్లోనూ తమ స్నేహితులతో సంప్రదింపులు జరుపుతూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీడియో క్లిప్పింగ్ల తర్వాత హార్దిక్ పటేల్ వద్ద కొద్ది మంది నమ్మకస్తులు మాత్రమే పనిచేస్తున్నారని బాంభానియా చెప్పారు.
హార్దిక్ను మిస్సయినా భరిస్తామంటున్న కుటుంబం
వివాదాలు తలెత్తినా.. ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నా.. మీడియా ద్రుష్టి సారించినా ఆయన కుటుంబం హార్దిక్ పటేల్ కు బాసటగా నిలిచింది. ధ్రుడ నిశ్చయంతో ఆయన వెన్నంటి ఉంటామని చెబుతోంది. హార్దిక్ జీవితం ఎంతకంటే మెరుగ్గా ఉంటుందని భావించడం లేదని, తమతో గడిపే అవకాశం లేకపోవడం ఇబ్బందికరమైనా భరించేందుకు సిద్ధమైంది. హార్దిక్ పటేల్ నాయకుడు కావాలని ప్రణాళిక వేసుకోలేదని, ఇది సహజసిద్దంగా జరిగిందని పేర్కొన్నారు. గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హార్దిక్ తండ్రి భారత్ భాయి పటేల్ తెలిపారు.