పెట్రోల్, డీజల్ ధరలు: కర్ణాటక ప్రజలకు గుడ్ న్యూస్, ప్రజల కోసం ప్రభుత్వం, సీఎం!
బెంగళూరు: పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలని ఆలోచిస్తున్నాయి. పెట్రోల్, డీజల్ ధరలు తగ్గిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రకటించారు.
సోమవారం కలబురగి (కుల్బర్గి)లో హైదరాబాద్ కర్ణాటక విమోచనా దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి మాట్లాడుతూ పెట్రోల్ పై రూ. 2, డీజల్ పై రూ. 2 తగ్గించాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంతమేర ఊరట కలిగిస్తుందని భావిస్తున్నామని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ సంకీర్ణ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
ప్రతి రోజు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి సమయంలో ఇంధన ధరలు తగ్గితే మేలు అని కర్ణాటక ప్రజలు భావించారని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
కర్ణాటక ప్రజల మేలు కోరుకుంటూ సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించిందని ముఖ్యమంత్రి కుమారస్వామి వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించిన విషయం తెలిసిందే.