మైనింగ్ కింగ్ గాలి ఫ్రెండ్ ? కేఏఎస్ అధికారి ఔట్
బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం రూ. 100 కోట్ల పాత పెద్దనోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇచ్చాడని, కారు డ్రైవర్ రమేష్ ఆత్మహత్యకు కారణం అయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఏఎస్ అధికారి భీమా నాయక్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భీమా నాయక్ కారు డ్రైవర్ గా పని చేస్తున్న మద్దూరు నివాసి రమేష్ గౌడ అలియాస్ రమేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రమేష్ ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టాడు. తన ఆత్మహత్యకు భీమా నాయక్, ఆయన సొంత కారు డ్రైవర్ మహమ్మద్ కారణం అని రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న భీమా నాయక్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరుగుతున్న భీమా నాయక్, ఆయన కారు డ్రైవర్ మహమ్మద్ ను కులబర్గీలో ఆదివారం అరెస్టు చేశారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైహాజరైన భీమా నాయక్ ను విధుల నుంచి తప్పిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి మద్దూరు గెస్ట్ హౌస్ లో భీమా నాయక్ ను సీఐడీ అధికారులు విచారించి వివరాలు సేకరిస్తున్నారు.
భీమా నాయక్, ఆయన కారు డ్రైవర్ ఇచ్చే సమాచారం మేరకు మిగిలిన వారిని అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రమేష్ తల్లి సాకమ్మ అంటున్నారు.