నాకిది మామూలే, ఏం కాదు: జయలలిత చివరిసారి మాట్లాడిన వీడియోలు విడుదల
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై దర్యాఫ్తు చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఆమె మరణానికి ముందు ఆసుపత్రిలో రికార్డైన రెండు ఆడియో క్లిప్పులను శనివారం విడుదల చేసింది. ఆమె మరణంపై అనుమానాలు రాగా, ఆమెకు చికిత్స అందించిన శివకుమార్ వాటిని కమిషన్కు సమర్పించారు. జయలలిత చివరి వాయిస్ రికార్డులో 52 సెకన్ల ఆడియో ఉంది.
ఆర్ముగస్వామి కమిషన్ జయలలిత మృతికి గల కారణాలపై విచారణ జరుపుతోంది. ఆ ఆడియోలో జయలలిత డాక్టర్తో మాట్లాడుతున్నారు. మీ బీపీ స్థాయి 140/80 ఉందని, మీకు రక్తపోటు చాలా ఎక్కువగా ఉందని డాక్టర్ జయతో చెప్పగా, ఏం కాదు ఇది నాకు సాధారణమేనని సమాధానం ఇచ్చారని ఒక ఆడియోలో రికార్డైంది.
మరో ఆడియోలో ఆమె విపరీతంగా దగ్గుతూ వైద్యుడికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆమె మరణించిన ఏడాదిన్నర తర్వాత విడుదలైన ఈ ఆడియోలను బట్టి ఆమె వైద్యం తీసుకొనే సమయంలో స్పృహలోనే ఉన్నట్లు వెల్లడవుతోంది.
జయలలిత ఆసుప్రతిలో చేరక ముందు ఆమె స్వదస్తూరితో రాసుకొని, అనుసరిస్తోన్న డైట్ ప్లాన్ను కూడా కమిషన్ విడుదల చేసింది. తూత్తుకుడి ఘటన నేపథ్యంలో ఈ ఆడియోను విడుదల చేయడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ ఘటనను నుంచి పక్కదారి పట్టించడానికే ఈ ఆడియోను విడుదల చేశారని డీఎంకే ఆరోపిస్తోంది.