లింగాయత్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల, తిరుగుబాటు చేస్తారా?: ఎన్నికల్లో కాంగ్రెస్కు అదే దెబ్బకొట్టింది
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మేజిక్ ఫిగర్ దక్కలేదు. జేడీఎస్తో కలిసి ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ను కాంగ్రెస్ తమ వైపుకు తిప్పుకుంటే, ఆ పార్టీలలోని అసంతృప్తులను బీజేపీ తమ వైపుకు తిప్పుకుంటోంది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్కు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం జేడీఎస్ శాసన సభా పక్షం సమావేశమైం కుమారస్వామిని జేడీఎస్ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అయితే కుమారస్వామికి సీఎం పదవి అంశంపై కాంగ్రెస్ పార్టీలోని లింగాయత్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
యెడ్డీని ఆహ్వానిస్తే కాంగ్రెస్ తీవ్రనిర్ణయం: 78మందిలో 50మందే హాజరు, ఆ ఎమ్మెల్యేలు పంజాబ్ రిసార్ట్కు
లింగాయత్ల ఆగ్రహం
కుమారస్వామిని సీఎంగా చేయడంపై ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కుమారస్వామికి ఆ పదవి కట్టబెట్టాలనుకోవడం వారికి ఇష్టం లేదని సమాచారం. దీనిని నిరసిస్తూ తిరుగుబాటు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాల్లోని రిసార్ట్స్కు తరలించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రోడ్డు మార్గంలో కాకుండా ప్రత్యేక విమానాల్లో పంజాబ్, ఏపీలలోని విలాసవంతమైన రిసార్ట్స్కు తరలిస్తారని ప్రచారం సాగింది. అయితే వారిని బెంగళూరులోని ఓ హోటల్కు తరలించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక క్యాంపు రాజకీయాలు ప్రారంభం కావడం ఆసక్తిని రేపుతోంది. జేడీఎస్ బుధవారం తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ హోటల్కు తరలించింది. కాంగ్రెస్ కూడా అదే హోటల్కు తరలించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలను సాయంత్రం కొచ్చిన్కు తరలించాలని యోచిస్తున్నారు.
కాంగ్రెస్ వ్యూహం రివర్స్
మత రిజర్వేషన్లతో చిచ్చు పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించలేదు. లింగాయత్లు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది లేదా గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ సీట్లను చాలా వరకు తగ్గించింది. ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలలో లింగాయత్ల ప్రాబల్యం ఎక్కువ. ఈ చోట్ల బీజేపీ సత్తా చాటింది.
లింగాయత్ల ప్రాబల్యం ఉన్నచోట బీజేపీదే హవా
లింగాయత్ల ప్రాబల్యం ఉన్నచోట ఈసారి బీజేపీ సత్తా చాటింది. ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలలో లింగాయత్ల ప్రాబల్యం ఉన్న చోట బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. ముంబై కర్నాటకలో బీజేపీ 50 సీట్లకు గాను 30 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు 2013లో 31 ఉండగా, ఈసారి 17 సీట్లకు పరిమితమైంది.
సెంట్రల్ కర్ణాటక
సెంట్రల్ కర్నాటకలో బీజేపీ 15 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మూడు సీట్లే. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు 19 నుంచి13కు తగ్గాయి. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోను బీజేపీకి 2013లో పది సీట్లు రాగా ఇప్పుడు పదిహేను సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 21 సీట్లు దక్కించుకుంది. అయితే, కాంగ్రెస్ విభజన రాజకీయాలు ఆమోదించని ప్రజలు దానిని తిప్పికొట్టారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ సులభంగా గెలిచేదని అంటున్నారు.