గాలికి మళ్లీ కష్టాలు: లోకాయుక్త దాడులు
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గనుల యజమాని గాలి జనార్దన్ రెడ్డి ఇళ్లపై మంగళవారం లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో బళ్లారి, బెంగళూరు నగరంలోని ఆయన ఇళ్లలో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు.
బళ్లారి లోకాయుక్త ఎస్పీ సంపత్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం ఉదయం బళ్లారి రోడ్డులోని సిరగుప్ప రోడ్డులోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు చేశారు. బెంగళూరు లోకాయుక్త ఎస్పీ సానియా నారంగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం బెంగళూరులోని ఇంటిలో సోదాలు చేశారు.
ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు సంపాధించారని ఆరోపిస్తూ లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. అక్రమ మైనింగ్ కేసులలో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి బెంగళూరులో నివాసం ఉంటున్నారు.
2007 నుంచి 2011 వరకు గాలి జనార్దన్ రెడ్డి 11 కంపెనీల పేర్లతో రూ. 362.78 కోట్ల ఆస్తి సంపాధించారని లోకాయుక్త అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ 11 కంపెనీలు నకిలీ కంపెనీలే అని అధికారులు చెబుతున్నారు.
11 కంపెనీల వలన తనకు లాభాలు వచ్చాయని గాలి జనార్దన్ రెడ్డి లెక్కలు చూపిస్తున్నారని లోకాయుక్త అధికారులు అంటున్నారు. బెంగళూరు, బళ్లారి నగరంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇళ్లలో పలు డాక్యూమెంట్లు, పత్రాలు సీజ్ చేసి విచారణ చేస్తున్నారు.