హై కోర్టులో కార్తీ చిదంబరంకు చుక్కెదురు, స్టే ఇవ్వలేం, సీబీఐలో తండ్రి చిదంబరం కేసు!
చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాసు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని నమోదైన కేసులో స్టే ఇవ్వాలని కార్తీ చిదంబరం పెట్టుకున్న పిటిషన్ ను మద్రాసు హై కోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టులో చిదంబరం విచారణ ఎదుర్కొంటున్నారు.
తమిళనాడులో భూమి
ఆదాయపన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులోని ముత్తుకాడు ప్రాంతంలో భూమిని విక్రయించిన వివరాలు ఆదాయపన్ను రిటర్న్స్ లో నమోదు చెయ్యలేదని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.
రూ. 1. 35 కోట్లు
భూమి విక్రయించిన కార్తీ చిదంబరం, ఆయన భార్య రూ. 1. 35 కోట్లు నగదు తీసుకున్నారని, ఆదాయపన్ను మాత్రం చెల్లించలేదని కేసు నమోదు అయ్యింది. మొదట ఈ కేసు చెన్నై మెట్రోపాలిటన్ ప్రత్యేక కోర్టు విచారణ చేసింది. తరువాత ఆర్థిక నేరాల కేసులు విచారణ చేసే ప్రత్యేక న్యాయస్థానంకు కార్తీ చిదంబరం కేసు బదిలి అయ్యింది.
ఎంపీ కాకముందే డీలింగ్
ఈ ప్రత్యేక కోర్టులోనే ప్రజా ప్రతినిధులకు చెందిన వివిద కేసులు నమోదైనాయి. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు స్టే ఇవ్వాలని కార్తీ చిదంబరం మద్రాసు హై కోర్టులో మనవి చేశారు. తాను ఎంపీ కాక ముందే ఈ వ్యవహారం జరిగిందని, అలాంటి సమయంలో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో తన కేసు ఎలా విచారణ చేస్తారని కార్తీ చిదంబరం ప్రశ్నించారు.
ఇక్కడ కొడుకు, అక్కడ తండ్రి !
కార్తీ చిదంబరం సమర్పించిన పిటిషన్ ను మద్రాసు హై కోర్టు కొట్టి వేసింది. మద్రాసు హై కోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో కార్తీ చిదంబరం షాక్ కు గురైనారు. కార్తీ చిదంబరం తండ్రి కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి చిదంబరం అరెస్టు అయ్యి సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.