పరీక్ష రాయకుండానే ఫెయిలయిన ఫడ్నవీస్..! మూడు రోజుల్లో కుప్పకూలిన మహా సర్కార్..!!
ముంబాయి/హైదరాబాద్ : పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయినట్టు తయారయ్యింది ఫడ్నవీస్ పరిస్థితి. బల నిరూపణ జరగక ముందే పరిణామాలను ఊహించి ప్రభుత్వం నుండి బీజేపి తప్పుకుంది. జరిగిన మొత్తం ఎపిసోడ్ లో బీజేపి తొందరపాటు రాజకీయాలకు పాల్పడిందనే చర్చ తెరమీదకు వస్తోంది. కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనాలోచితంగా సీఎం పీఠం దక్కించున్న బీజేపీ చివరకు దేశ ప్రజల ముందు తలవంపులు తెచ్చుకుంది.
మూడు చక్రాల కుర్చీ సర్కార్.. ఎన్నాళ్లుంటుందో..అంతా ఆయనే చేశారు: ఫడ్నవీస్
కర్ణాటక మాదిరిగానే మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ బలపరీక్షకు ముందే బీజేపీ వెనక్కితగ్గింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే ఫడ్నవిస్ కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో బలం లేకున్నా బీజేపీ సర్కారు ఏర్పాటుచేసి బొక్కబోర్లా పడింది.
రాష్ట్రపతి పాలన అమల్లో ఉండాగానే ఆగమేఘాల మీద అర్ధరాత్రి పావులు కదిపి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసారు. ఐతే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది.
కానీ బల నిరూపణకు సంఖ్య బలం లేకపోవడంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 3రోజుల 8 గంటల్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముంబైలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం ఈ ఎపిసోడ్ లో మరాఠా యోధుడు శరద్ పవర్ చాణిక్యం ముందు భారతీయ జనతా పార్టీ తలవంచక తప్పలేదు.