జమ్మూ ఉగ్రదాడి: బెంగళూరులో మేజర్ అంత్యక్రియలు
జమ్మూ కాశ్మీర్ లోని నగ్రోటాలో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించడానికి బెంగళూరు నగరంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
బెంగళూరు: జమ్మూలోని నగ్రోటాలో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించడానికి బెంగళూరు నగరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. బెంగళూరు-బళ్లారీ రోడ్డులోని హెబ్బాళలోని స్మశానవాటికలో అంత్యక్రియలు చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
జమ్మూ నుంచి మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్ మృతదేహంతో బయలుదేరిన ప్రత్యేక సైనిక విమానం గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో బెంగళూరులోని యలహంకలోని ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్యాంపస్ లో అధికారులు మేజర్ అక్షయ్ కు నివాళులు అర్పించారు. మద్యాహ్నం 12 గంటల సమయంలో అక్షయ్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న యలహంక సమీపంలోని సాదళ్ళిలో ఉన్నఅపార్ట్ మెంట్ దగ్గరకు అక్షయ్ మృతదేహం తీసుకు వెళ్లారు.
అక్కడ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమ దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మద్యాహ్నం 2 గంటలకు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులు అంతిమ దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
మద్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంచనాలతో గౌరవవందనం సమర్పించి అక్షయ్ గిరీష్ కుమార్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకు వెళ్లి హెబ్బాళ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.