ప్రియురాలి కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లి: జైలు
న్యూఢిల్లీ: ప్రియురాలిని చూడటానికి ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన విదేశీయుడు చివరికి కటకటాలపాలైనాడు. నకిలీ ఈ - టిక్కెట్ తో ఎయిర్ పోర్టులో అటూ ఇటూ తిరుగుతున్న అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజీఐఏ) ఇటలీ దేశస్తుడు అరెస్టు అయ్యాడని పోలీసులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఢిల్లీ విమానాశ్రయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హై అలర్ట్ ఉండటంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అదే రోజు నకిలీ ఈ - టిక్కెట్ తీసుకున్న ఇటలీ దేశస్తుడు ఎయిర్ పోర్టులోకి వెళ్లాడు. అతని ప్రియురాలు విదేశాలకు వెలుతుంటే చూడటానికి అక్కడికి చేరుకున్నాడు.
పహారా కాసే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం రావడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. తాను ప్రయాణికుడు కాదని విచారణలో అతను అంగీకరించాడు. ఆగస్టు 16వ తేదిన అతను మాస్కో వెళ్లాల్సి ఉంది.
అధికారులు ఆమోదం తెలిపిన టిక్కెట్ అతని దగ్గర ఉండటంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఈ - టిక్కెట్ తాను చింపేశానని అతను అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
తన ప్రియురాలు చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆగస్టు 15న ప్రయాణిస్తుందని తెలిసి ఎయిర్ పోర్టుకు వచ్చానని, ఆమెను చూడటానికి ఇలా చేశానని ఇటలీ యువకుడు పోలీసులకు చెప్పాడు.
అతని మీద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. గత 14 నెలల్లో నకిలీ ఈ - టిక్కెట్లతో విమానాశ్రయంలోకి ప్రవేశించిన 30 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.