టెర్రర్ వార్నింగ్: బక్రీద్ తరువాత కాశ్మీరీల హత్య
బెంగళూరు: భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్న 25 మంది కాశ్మీరీలను బక్రీద్ పండుగ తరువాత చంపేస్తామని జైష్-ఇ-మోహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. మా హిట్ లిస్ట్ లో ఉన్న 25 మంది కాశ్మీరీలు వీరే అంటూ పేర్లు వెల్లడించింది.
జైష్-ఇ-మోహమ్మద్ ఉగ్రవాదులు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఉగ్రవాదులు ముసుగులు వేసుకుని మాట్లాడారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో బీజేపీకి చెందిన వారితో పాటు జమ్మూ కాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీపుల్స్ పబ్లిక్ పార్టీకి చెందిన ఐదు మంది ఉన్నారు.
మీరందరు భారత్ కు మద్దతు ఇవ్వరాదని, మొండిగా ఉంటే మీ ప్రాణాలు కచ్చితంగా తీస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు. ఇటీవల ఎన్ కౌంటర్ లో అంతం అయిన హిజబుల్ మొజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ హని పేరు ప్రస్తావించారు.
మా హిట్ లిస్టులో ఉన్న 25 మంది వారి కార్యకలాపాలు మార్చుకోవాలని, భారతదేశానికి మద్దతు ఇవ్వరాదని సూచించారు. మీకు సెప్టెంబర్ 13వ తేది బక్రీద్ పండగ డెడ్ లైన్ పెడుతున్నామని హెచ్చరించారు.
భారత్ చేపట్టిన అన్నీ కార్యక్రమాలను ప్రజలు బహిష్కరించాలని కాశ్మీరీలకు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వానికి మీరు సహకరించరాదని, జైష్-ఇ- మోహమ్మద్ చేపట్టిన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఉగ్రవాదులు 25 మంది కాశ్మీరీలను హెచ్చరించారు.