ముంబైలో ఈ టాయ్లెట్స్ నిర్మాణం ధర తెలిస్తే షాకవుతారు
ముంబై: ముంబైలో పర్యావరణ అనుకూల టాయ్లెట్స్ ప్రారంభమయ్యాయి. చాలా విలాసవంతంగా ఉన్న ఈ మరుగుదొడ్లను ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ టాయ్లెట్స్ కు సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయడమే కాక వాక్యూమ్ టెక్నాలజీని వినియోగించారు.ఈ టెక్నాలజీ వినియోగం వల్ల నీరు వృధా కాకుండా ఆదా అవుతంది. ఈ టాయ్లెట్ నిర్మాణానికి అయిన ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణం కోసం అయిన ఖర్చు మొత్తం రూ.90 లక్షలు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.
సాధారణంగా సులభ్ కాంప్లెక్స్లోకి వెళ్లాలంటేనే ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ అత్యంత విలాసవంతమైన టాయ్లెట్ను వినియోగించుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పూర్తిగా ఉచితం అని అధికారులు వెల్లడించారు. ఈ మరుగుదొడ్లను శివసేన యూత్ వింగ్ లీడర్ ఆదిత్య థాక్రే ప్రారంభించారు. ఈ ఆరు బ్లాక్స్ ఉన్న టాయ్లెట్స్ను నిర్మించేందుకు ప్రముఖ స్టీల్ కంపెనీ జేఎస్డబ్ల్యూ, సామ్టెక్ ఫౌండేషన్, నారిమన్ పాయింట్ చర్చ్ గేట్ సిటిజెన్ అసోసియేషన్లు కలిసి తమవంతు సహకారం అందించాయి.
సాధారణంగా ఒక సింగిల్ ఫ్లష్ కోసం ఎనిమిది లీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ కొత్తగా నిర్మించిన ఈ టాయ్లెట్స్లో ఒక సింగిల్ ఫ్లష్కు 800 మిల్లీలీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతుందని జేఎస్డబ్ల్యూ అధికారి ఒకరు వెల్లడించారు. నీరును ఆదా చేయడంతో పాటు ఇందులో ఉన్న వాక్యూమ్ టెక్నాలజీ చెత్తచెదారం మెరైన్ డ్రైవ్ బేలో కలవకుండా చేస్తుందని సామ్టెక్ ఫౌండేషన్స్ సహవ్యవస్థాపకులు అక్షత్ గుప్తా తెలిపారు.