జనవరి 23నుంచి నేతాజీ సీక్రెట్ ఫైళ్లు బహిర్గతం: మోడీ
ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధంచిన రహస్య ఫైళ్లను అన్నింటినీ జనవరి 23వ తేదీ నుంచి బహిర్గతం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ప్రధాని మోడీని నేతాజీ కుటుంబ సభ్యులు 35 మంది కలిశారు. గంటపాటు మాట్లాడారు.
నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను తమ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని ప్రధాని మోడీ వారికి చటెప్పారు. 1945 ఆగస్టు 18న నేతాజీ అదృశ్యమైనప్పటినుంచి ఆయన అదృశ్యానికి సంబంధించిన మిస్టరీలో వాస్తవాలను బయటపెట్టాలంటూ నేతాజీ కుటుంబ సభ్యులతో పాటుగా పలు వర్గాలు గత 70 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చినట్లవుతుంది.
బుధవారం 7, రేస్కోర్సు రోడ్డులోని తన అధికార నివాసంలో తనను కలిసిన నేతాజీ కుటుంబ సభ్యులకు ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చరిత్రను గొంతు నులమాల్సిన అవసరం లేదని అనంతరం ఈ అంశంపై ట్విట్టర్లో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
అంతేకాదు నేతాజీకి సంబంధించి తమ వద్ద అందుబాటులో రహస్య పత్రాలను వెల్లడించాల్సిందిగా ఇతర దేశాల నేతలను లేఖల ద్వారా, వ్యక్తిగతంగా కలిసినప్పుడు కోరుతానని, డిసెంబర్లో రష్యాతో ఇది ప్రారంభమవుతుందని తెలిపారు.
తమ చరిత్రను మరిచిపోయే దేశాలకు దాన్ని సృష్టించే శక్తి ఉండదని ప్రధాని అన్నారు. సుభాష్ జయంతి అయిన 2016 జనవరి 23న నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాల వెల్లడించే ప్రక్రియ ప్రారంభమవుతుందని దాదాపు గంట సేపు నేతాజీ కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం ట్విట్టర్లో మోడీ తెలిపారు.