డికె రవి మృతి కేసులో ట్విస్ట్: మంత్రికి సిబిఐ నోటీసులు?
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. కర్ణాటక ప్రభుత్వంలోని ఒక పలుకుబడి కలిగిన మంత్రికి, పోలీసు అధికారులకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారని వార్తలు గుప్పుమన్నాయి.
చెన్నయ్ నుండి బెంగళూరు వచ్చిన 12 మంది సీబీఐ అధికారులు మూడు టీంలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. కోలారు నుండి బెంగళూరులో డికే రవి మరణించిన రోజు వరకు జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.
ఇప్పటికే సీబీఐ అధికారులు డికే. రవి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఇప్పుడు నోటిసులు ఇచ్చిన వారందరిని విచారణ చేసి వారు ఇచ్చే స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకోవాలని సిద్దం అవుతున్నారు. మంత్రితో పాటు పోలీసు అధికారులను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ నీనా సింగ్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి ఆద్వర్యంలోని సీబీఐ అధికారులు గురువారం విధాన సౌధ చేరుకున్నారు. తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జిని ఆయన ఛాంబర్ లో కలిశారు.
తరువాత రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. పట్నాయక్ ను కలిశారు. డికే. రవి కేసు గురించి సుమారు రెండు గంటల పాటు వారితో చర్చించారు. కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు తమకు ప్రత్యేక కార్యాలయం, కార్లు తదితర సదుపాయాలు కల్పించాలని సీబీఐ అధికారులు వారికి చెప్పారని తెలిసింది.
డికే. రవి కేసు దర్యాప్తునకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని కౌసిక్ ముఖర్జి, ఎస్.కే. పట్నాయక్ సీబీఐ అధికారులకు హామి ఇచ్చారు. రవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆయనతో కలిసి పని చేసిన సిబ్బంది, ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యాలని సీబీఐ అధికారులు సిద్దం అయ్యారు.