ఒకే ఒక్కడు : కరోనా లాక్ డౌన్లోనూ దుమ్ము రేపే లాభాల్లో ఇండియన్ టైకూన్..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తీసుకున్న లాక్ డౌన్ ఎఫెక్ట్తో చాలా రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. లాక్ డౌన్ ఎత్తేసినా సరే.. ఆర్థిక రంగం తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో..లాక్ డౌన్ తర్వాత కూడా చాలా రంగాలు పుంజుకునే అవకాశం కనిపించట్లేదు. కానీ ఇంతటి సంక్షోభంలోనూ ఒకే ఒక్క సంస్థ మాత్రం లాభాలను గడిస్తోంది. భారత్లో మరే పారిశ్రామికవేత్తకు సాధ్యం కానీ ఆ ఫీట్ను సాధిస్తున్న పారిశ్రామికవేత్త ఎవరో తెలుసా..
డీమార్ట్.. రాధాకృష్ణన్ దమాని..
డీమార్ట్ వ్యవస్థాపకుడు,అవెన్యూ సూపర్ మార్కెట్స్ లిమెటెడ్ అధినేత రాధాకృష్ణన్ దమాని నికర ఆదాయం ఈ ఏడాది 11శాతం పెరిగి అపర కుబేరుల జాబితాలో చేరిపోయారు. 10.7బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోని 12 మంది సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్ విలువ దాదాపు 24శాతం పెరగడంతో దమాని నికర ఆదాయం కూడా పెరిగిపోయింది. ప్రస్తుత లాక్ డౌన్ పీరియడ్లో రిలయన్స్ అధినేత అంబానీ,కొటక్ అధినేత ఉదయ్ కొటక్ 32శాతం నష్టాలను చవిచూడగా.. దమాని సూపర్ మార్కెట్ చైన్ మాత్రం ఈ స్థాయి లాభాలతో దూసుకుపోతుండటం విశేషం.
డీమార్ట్లలో పెరిగిన విక్రయాలు
లాక్ డౌన్ అనవసర భయాందోళనలు,అపోహలకు దారితీయడంతో.. భారత్లో చాలామంది ప్రజలు పెద్ద మొత్తంలో నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువమంది డీమార్ట్లకే వెళ్తున్నారు. దీంతో ఇంత సంక్షోభ సమయంలో ఒక్క డీమార్ట్ వస్తువులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్నాయి. దీంతో కంపెనీ షేర్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ముంబైకి చెందిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ నిపుణుడు అరుణ్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎక్కువగా డీమార్ట్కే వెళ్లడానికి కారణం.. ఆ మాల్స్ నిరాడంబరత కూడా ఒక కారణమని చెప్పారు. డీమార్ట్ స్టోర్స్లో చౌక ధరలకే నిత్యావసరాలు దొరుకుతాయి కాబట్టి.. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా.. వారి విక్రయాలు నిలకడగా ఉంటాయని చెబుతున్నారు.
Recommended Video
నెగ్గుకురాలేకపోతున్న ప్రత్యర్థులు
డీమార్ట్ ప్రత్యర్థి గ్రూపులైన ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలు మాత్రం లాక్ డౌన్ సమయంలో నెగ్గుకురాలేకపోతున్నాయి. సప్లై చైన్కు ఆటంకం ఏర్పడనంతవరకు డీమార్ట్ విక్రయాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికైతే డీమార్ట్ స్టోర్స్లో షెల్ఫ్స్ అన్నీ ఎప్పటికప్పుడు రీఫిల్ అవుతూనే ఉన్నాయని చెబుతున్నారు. ఏదేమైనా ముంబైలోని టెనెమెంట్ బ్లాక్లో ఉన్న అపార్ట్మెంట్లోని సింగిల్ రూమ్లో పెరిగిన దమాని.. ఈరోజు భారత్లోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరడం విశేషం. దేశంలో ఉన్న ప్రజల నిత్యావసరాలే మార్కెట్గా ఆయన మొదలుపెట్టిన డీమార్ట్ చైన్ ఆయన్ను విజయ శిఖరాలకు చేర్చింది.