"సచివాలయంలో బాంబులు పెట్టాం జాగ్రత్త!"
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సచివాలయంలో బాంబులు పెట్టామని బెదిరింపులు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సచివాలయంలోని ఉద్యోగులందరనీ బయటకు పంపించి బాంబుల కోసం తనిఖీలు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ సచివాలయం అయిన రైటర్స్ బిల్గింగ్ లోని ఒక భవనంలో బాంబు ఉందని ఈ మెయిల్ వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబు నిర్వీర్యదళం బృందాల సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.
సీనియర్ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. సిబ్బంది బ్యాగులు, టిఫిన్ బాక్స్ లు పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి బాంబులు చిక్కలేదని పోలీసు అధికారులు అంటున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
కోల్ కతాలోని రైటర్స్ బిల్గింగ్ కు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటీష్ వారు ఈ రైటర్స్ బిల్డింగ్ నిర్మించారు. రైటర్స్ బిల్డింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చేశారు. అలాంటి బిల్గింగ్ లో బాంబులు పెట్టామని బెదిరించడంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.