ఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతం
న్యూఢిల్లీ: దేశానికి అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీన్ని ఏఏ రంగాలకు, ఏ రూపంలో బదలాయించాలనే విషయాన్ని తమకు అప్పగించారని చెప్పారు. దీనిపై తాము అన్ని రంగాలకు చెందిన నిపుణులతో చర్చించిన తరువాతే తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
ఆత్మనిర్బర్కు అర్థాన్ని వివరిస్తూ ఆరంభం..
బుధవారం సాయంత్రం ఆమె న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆత్మనిర్భర భారత్ మిషన్కు ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగం, వ్యవస్థ, డెమోగ్రఫీ, డిమాండ్.. ఈ అయిదూ మూలస్తంభాలని, వాటిని బలోపేతం చేయడానికి ఈ ప్యాకేజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. తన విలేకరుల సమావేశం ప్రారంభంలోనే ఆమె దక్షిణాదికి చెందిన నాలుగు భాషల్లో ఆత్మ నిర్భర్ అనే పదానికి అర్థాన్ని వివరించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దానికి అర్థం తెలిపారు. ప్రధానమంత్రి దూరదృష్టి ఏమిటనేది ఈ ఆర్థిక ప్యాకేజీ ద్వారా స్పష్టమౌతోందని అన్నారు.
కుటీర, లఘు పరిశ్రమలను బలోపేతం చేస్తాం..
ఈ ప్యాకేజీని ఆధారంగా చేసుకుని కుటీర, లఘు, గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి కంపెనీలకు రాయితీలను ఇస్తామనీ అన్నారు. చైనా నుంచి బయటికి వచ్చే కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారించామని, దీనికి అవసరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. చైనాను వీడి వెళ్లే కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేదిశగా రాయితీలను ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.
దేశీయ బ్రాండింగ్..
దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తామని, ఉత్పాదకతను పెంచుతామని అన్నారు. 30 లక్షల 42 వేల 230 కోట్ల రూపాయాల బడ్జెట్ను ఈ ఏడాది ప్రతిపాదించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అందులో నుంచి 20 లక్షల కోట్లను ఆర్థిక ప్యాకేజీ కింద ప్రకటించామని అన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా దేశీయ బ్రాండింగ్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకుని వస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. డీబీటీ మాధ్యమం ద్వారా పేదలకు ఈ ఫలాలను చేరేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
Recommended Video
రుణాల వసూళ్లకు నాలుగేళ్ల గడువు..
ఎంఎస్ఎంఈలకు అందించే రుణాలను తిరిగి చెల్లించే గడువును నాలుగేళ్లకు పెంచినట్లు చెప్పారు. ఈఎంఐలో ఒక ఏడాది పాటు మినహాయింపు కూడా ఇస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు ఇదివరకు కంటే అధికంగా రుణాలను అందిస్తామని, దీనికోసం మూడు లక్షల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా జన్ధన్ ఖాతాల్లోకి నేరుగా 500 రూపాయలను చేరుస్తామని తెలిపారు.